Wednesday, June 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఎమర్జెన్సీకి 50 ఏండ్లు

ఎమర్జెన్సీకి 50 ఏండ్లు

- Advertisement -

– నాడు ప్రకటిత ఎమర్జెన్సీ… నేడు అప్రకటిత ఎమర్జెన్సీ
– నేడు నిరసనలు, సభలు, సమావేశాలు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఆనాటి కాంగ్రెస్‌ పార్టీ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించి బుధవారం నాటికి 50 ఏండ్లు పూర్తవుతున్న నేపధ్యంలో మరోసారి గుర్తు చేసుకోవలసిన అవసరముందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. అప్పుడు కాంగ్రెస్‌ ప్రకటిత ఎమర్జెన్సీ, ఇప్పుడు బీజేపీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ నేపథ్యంలో బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టాలనీ, సభలు, సమావేశాలను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఎమర్జెన్సీ విధించినప్పుడు మొత్తం ప్రజాస్వామిక హక్కులన్నింటినీ కాలరాసిందని కార్మిక సంఘాల నాయకులందరినీ నిర్భందించారని తెలిపారు. సమ్మెలు చేయొద్దంటూ హుకుం జారీ చేసిందని పేర్కొన్నారు. ప్రతిపక్షనాయకులందరినీ జైళ్లలో పెట్టారని గుర్తు చేశారు. నిరసన కార్యక్రమాలను ఉక్కుపాదంతో అణచివేసే చర్యలకు పాల్పడిందని తెలిపారు. ఆ నేపధ్యంతో ప్రజలు పెద్దఎత్తున తిరుగుబాటు చేసి కాంగ్రెస్‌ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారనీ, నాడు జరిగిన ఎన్నికల్లో ఓడిరచారని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ఈ సందర్భంగా నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిందని గుర్తు చేశారు. బీజేపీ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగ హక్కులను కాలరాసిందని తెలిపారు. ప్రజాస్వామిక హక్కులను నిరాకరిస్తున్నదని పేర్కొన్నారు. లౌకికతత్వానికి వ్యతిరేకంగా మతోన్మాద రాజకీయాలను నడుపుతున్నదని వివరించారు. సామాజిక న్యాయానికి భిన్నంగా అసమానతలను పెంచి పోషిస్తున్నదని తెలిపారు.
జర్నలిస్టులను జైళ్లలో పెట్టిందని పేర్కొన్నారు. విద్యార్థి ఉద్యమ నాయకులను జైళ్లలో పెట్టి ఉపా చట్టం కింద నిర్భందించిందని వివరించారు. ప్రతిపక్ష నాయకుల మీద రాజ్యాంగ సంస్థలనుపయోగించి అక్రమ కేసులను బనాయించి, జైళ్లపాలు చేయడం వంటి అప్రజా స్వామిక చర్యలను కొనసాగిస్తున్నదని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాలకోసం ఈనాడు బీజేపీ అప్రకటిత ఎమర్జెన్సీని ప్రకటించిందని తెలిపారు. ఆనాడు కాంగ్రెస్‌ ఎమర్జెన్సీని ప్రకటించినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు ఇందిరాగాంధీకి మద్దతునిచ్చారని గుర్తు చేశారు. ఆనాడు కాంగ్రెస్‌కు, ఇందిరాగాంధీకి అనుకూలంగా ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవహరించిన తీరును ఆనాడే సుబ్రహ్మణ్యస్వామి బయటపెట్టారని పేర్కొన్నారు. హిట్లర్‌ వారసత్వంతో కూడిన బీజేపీ ఈనాడు కూడా ప్రజాఉద్యమాలను అణచివేస్తున్నదని విమర్శించారు.
కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా, మతోన్మాద భావాలతో మతోన్మాద రాజకీయాలను కొనసాగిస్తున్నదని తెలిపారు. ఆనాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలు ఎట్లయితే పోరాటం చేశారో, ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగిస్తున్న బీజేపీ నియంతృత్వ, నయా ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఆనాడు ఎమర్జెన్సీలో సీపీఐ(ఎం) నాయకులు పెద్దఎత్తున ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. కేరళలో ప్రజలు ముందుండి పోరాటం చేశారని పేర్కొన్నారు. ఎకె గోపాలన్‌ పార్లమెంటులో నిరసన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. సీపీఐ(ఎం) నాయకులనందరినీ నిర్భందించి జైళ్లలో పెట్టారని తెలిపారు. దాన్ని ఎదుర్కొని తమ పార్టీ పోరాడిందని వివరించారు. ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ పేరుతో ఈ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసి, ఈ నయా ఫాసిస్టు ధోరణులకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరముందని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తతంగా సీపీఐ(ఎం) అఖిల భారత కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, సెమినార్లు, సభలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -