– వీరిలో సగం మందికి పైగా చిన్నారులు, మహిళలు
– 1.27 లక్షల మందికి పైగా గాయాలు : గాజా ఆరోగ్య శాఖాధికారుల వెల్లడి
– ఆగని ఇజ్రాయిల్ యుద్ధోన్మాదం
గాజా: ఇజ్రాయిల్ యుద్ధోన్మాదం అమాయకపు పాలస్తీనా ప్రజల ప్రాణాలను తీస్తున్నది. ప్రపంచంలోని అనేక దేశాలు యుద్ధాన్ని వద్దని వాదిస్తున్నా.. ఇజ్రాయిల్ మాత్రం ససేమిరా అంటున్నది. డ్రోన్లు, మిసైల్స్, బాంబులతో పాలస్తీనాపై విరుచుకుపడుతున్నది. దీంతో మహిళలు, చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు.. ఇలా ప్రతి ఒక్కరూ ఇజ్రాయిల్ దుర్నీతికి బలవుతున్నారు. వీటికి సంబంధించిన పలు వీడియోలు, చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతూ.. నెటిజన్లను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. దాదాపు 20 నెలలుగా ఈ యుద్ధ వాతావరణాన్ని కొనసాగిస్తున్నది. ఇప్పటి వరకు ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో 55 వేల మందికి పైగా పాలస్తీనా ప్రజలు చనిపోయారు. లక్షలాది మంది గాయపడ్డారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సమాచారం ప్రకారం.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 55,104 మంది చనిపోయారు. 1,27,394 మంది గాయాలపాలయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే సగం మంది కంటే ఎక్కువగా ఉన్నారని వివరించింది. చాలా మంది శిథిలాల కిందే చిక్కుకొని ఉన్నట్టు భావిస్తున్నారు. 2023, అక్టోబర్ నుంచి ఇజ్రాయిల్ దళాలు గాజాపై విరుచుకుపడుతున్నాయి. అనేక ప్రాంతాలను ధ్వంసం చేశాయి. 90 శాతం మంది ప్రజలు ఇజ్రాయిల్ దాడులకు బయపడి అక్కడి నుంచి తరలివెళ్లినట్టు తెలుస్తున్నది. అంతేకాదు.. గాజాలో ఆకలికేకలు ఆందోళనను కలిగిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా.. ఇజ్రాయిల్లోని నెతన్యాహు ప్రభుత్వం చలించటం లేదు. యుద్ధాన్ని కొనసాగిస్తామనే చెప్తున్నది. ఇజ్రాయిల్.. గాజాను నిరవధికంగా నియంత్రిస్తుందనీ, దాని జనాభాలో ఎక్కువ మందిని ఇతర దేశాలకు స్వచ్ఛందంగా వలస వెళ్లేలా చేస్తుందని నెతన్యాహు చెప్పారు. అయితే, అంతర్జాతీయ సమాజం ఇజ్రాయిల్ చర్యలను తీవ్రంగా తప్పుబట్టింది. అలాంటి ప్రణాళికలు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించే బలవంతపు బహిష్కరణగా అభివర్ణించింది. యూఎస్ మద్దతుతోనే ఇజ్రాయిల్ ఈ యుద్ధాన్ని కొనసాగిస్తున్నదని అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. ఇజ్రాయిల్ ఇకనైనా యుద్ధానికి ముగింపు పలకాలని వారు నొక్కి చెప్తున్నారు.
55వేల మంది పాలస్తీనీయులు బలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES