– ఆపరేషన్ సిందూర్ పేరిట… వ్యక్తిగత ఇమేజ్ కోసం మోడీ తంటాలు
– సైనిక విజయాలకు కేంద్ర బిందువుగా నిలిచే ప్రయత్నం
ఆపరేషన్ సిందూర్లో భారత సైనిక దళాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలపై జాతి యావత్తూ ప్రశంసలు కురిపిస్తూనే ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం అందివచ్చిన ఈ అవకాశాన్ని తన ఇమేజ్ని పెంచుకోవడానికి ఉపయోగించు కుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆపరేషన్ సిందూర్పై ప్రధాని మోడీ గత నెల 12న తొలిసారి పెదవి విప్పారు. అదే విధంగా కాల్పుల విరమణ జరిగిన 48 గంటల తర్వాత ఆయన దూకుడుగా వ్యవహరించడం మొదలు పెట్టారు. గత నెల 22వ తేదీ నుంచి 31 వరకూ…అంటే ఎనిమిది రోజుల వ్యవధిలో తొమ్మిది ర్యాలీలలో ప్రసంగించారు. ప్రతి చోటా ఆపరేషన్ సిందూర్ ప్రస్తావనే. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలలో ఆయన పర్యటించి ర్యాలీలలో ప్రసంగించారు. పాక్పై భారత్ సైనికులు సాధించిన విజయానికి తానే కేంద్ర బిందువునని చూపే ప్రయత్నం చేశారు. మోడీ తాజా పర్యటనలపై ప్రముఖ పాత్రికేయురాలు స్రవస్తి దాస్గుప్తా అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం…
న్యూఢిల్లీ: ఇటీవల బీజేపీ నాయకులు మహిళలపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను మోడీ ఎక్కడా ప్రస్తావించలేదు. ఖండించనూ లేదు. కానీ బాధిత మహిళల కన్నీటి వ్యథలకు ప్రతీకారం తీర్చుకోవడానికి చేపట్టిన చర్యగా ఆయన ఆపరేషన్ సిందూర్ను అభివర్ణించారు. ఏ ర్యాలీలో చూసినా మోడీ ప్రసంగాలన్నీ ఆపరేషన్ సిందూర్ చుట్టూనే సాగాయి. సైనిక దుస్తులు ధరించిన ప్రధాని కటౌట్లే దర్శనమిచ్చాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన సైనిక చర్య నుండి ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించిన మోడీ… దాడికి కారణమైన ఉగ్రవాదుల గురించి, ఇప్పటికీ పట్టుబడని ముష్కరుల గురించి, కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించిన అమెరికా గురించి, అణు యుద్ధ ప్రమాదం నుండి రెండు దేశాలను బయటపడేసేందుకు వాణిజ్యం ఉపయోగ పడిందంటూ ట్రంప్ నిరంతరం చేస్తున్న ప్రకటనల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ తర్వాత మోడీ జరిపిన పర్యటనలు, ప్రసంగించిన ర్యాలీలను సింహావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
‘మా భారత్ సేన మోడీ’
మోడీ తన ఆపరేషన్ సిందూర్ ర్యాలీలను రాజస్థాన్ పర్యటనతో ప్రారంభించారు. గత నెల 22న బికనీర్లో జరిగిన ర్యాలీలో ప్రసం గించారు. తన సిరల్లో రక్తం ప్రవహిం చడం లేదని, వేడి సిందూరం ప్రవహిస్తోందని చెప్పారు. భారత ప్రతినిధులు వివిధ దేశాలలో పర్యటిస్తూ పాక్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నారని తెలిపారు. మోడీ తల చల్లగానే ఉన్నా రక్తం వేడిగా ఉన్నదని అన్నారు. ప్రత్యక్ష యుద్ధం జరిగినప్పుడు పాక్ దుమ్ము దులపాలని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దశాబ్దాలుగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆయుధంగా వాడుకుంటోందని అంటూ ఇప్పుడు ‘మా భారత్ సేన మోడీ’ ఇక్కడ నిలబడి ఉందన్న విషయాన్ని ఆ దేశం మరచిపోయిందని చెప్పుకొచ్చారు.
అప్పగించిన బాధ్యతను మోడీ పూర్తి చేశాడు
ఆ తర్వాత నాలుగు రోజులకు మోడీ తన స్వరాష్ట్రమైన గుజరాత్లో పర్యటించారు. అక్కడ ఆయన రోడ్షోలు నిర్వహిస్తున్నప్పుడు మహిళలు ఎర్రని చీరలు, టోపీలు ధరించి వరుసగా నిలబడ్డారు. తనను మూడో వ్యక్తిగా సంబోధించుకుంటూ ప్రసంగించిన మోడీ ఉగ్ర దాడిపై భావోద్వేగపూరితమైన వ్యాఖ్యలు చేశారు. అయితే దాడికి పాల్పడిన ఉగ్రవాదులపై జరుగుతున్న దర్యాప్తు తీరును మాత్రం ప్రస్తావించలేదు. ‘ఉగ్రవాదులు 140 కోట్ల మంది భారతీయులను సవాలు చేశారు. అందుకే వారు అప్పగించిన బాధ్యతను మోడీ పూర్తి చేశారు. మోడీ త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు’ అని అన్నారు. మన సాయుధ దళాలు బలంగా ఉన్నప్పుడు, మన ఆర్థిక వ్యవస్థ పటిష్టవంతంగా ఉన్నప్పుడు మాత్రమే వికసిత్ భారత్ సాకారం అవుతుందని ముక్తాయింపు ఇచ్చారు.
గణేశుడు కూడా విదేశీయుడిగా వస్తాడు
గత నెల 27న గాంధీనగర్లో జరిగిన సభలో కూడా మోడీ ఆపరేషన్ సిందూర్ ప్రస్తావన చేశారు. చైనా పేరును చెప్పకుండా ఆ దేశం నుంచి వస్తున్న వస్తువులను బహిష్కరిం చాలని పిలుపునిచ్చారు. గణేశుడు కూడా తెరుచుకోని చిన్న చిన్న కళ్లతో విదేశీయుడిగా వస్తాడని అన్నారు. ‘2047లో మనం వందవ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. విదేశీ వస్తువులను ఉపయోగించకూడదని నిర్ణయించుకుంటాం. ఎంత లాభం వచ్చినా సరే విదేశీ వస్తువులను అమ్మబోమని గ్రామాలలో వ్యాపారులు ప్రతిజ్ఞ చేస్తారు. కానీ దురదృష్టవశాత్తూ గణేష్ జీ కూడా విదేశీయుడిగానే వస్తాడు. చిన్న చిన్న కళ్లతో వస్తాడు. కళ్లు తెరవడు’ అని చెప్పుకొచ్చారు. ప్రజలు తాము వినియోగిస్తున్న విదేశీ వస్తువుల జాబితాను తయారు చేసుకోవాలని సూచించారు. మనం ఉపయోగించే వస్తువులలో మనకు తెలియకుండానే అనేక విదేశీ వస్తువులు ఉంటాయని తెలిపారు.
ఎవరితో పెట్టుకుంటున్నారో తెలుసా?
గత నెల 26న భుజ్లో జరిగిన ర్యాలీలో కూడా మోడీ ప్రసంగించారు. పాక్ తన స్వరాష్ట్రమైన గుజరాత్పై డ్రోన్ దాడులు జరిపిందంటూ పొంతన లేని వ్యాఖ్య చేశారు. ‘9వ తేదీ రాత్రి మా కచ్ సరిహద్దులో కూడా డ్రోన్లు కన్పించాయి. మోడీ గుజరాత్ నుండి వచ్చినందున వారు ఇక్కడ తమదైన ముద్ర వేయాలని ప్రయత్నించారు. కానీ ఎవరితో పెట్టుకుంటున్నారో వారికి తెలియడం లేదు’ అని అన్నారు. 1971 యుద్ధంలో పాల్గొన్న మహిళలు తనకు సిందూర్ మొక్కను బహుమతిగా ఇచ్చారని చెప్పారు. ‘ఈ మొక్కను ప్రధాని ఇక్కడ నాటుతారు. అది వటవృక్షంలా పెరుగుతుంది’ అని పేర్కొన్నారు.
సత్తా చాటాం
మే 29న మోడీ సిక్కిం పర్యటన వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దయింది. అయినప్పటికీ ఆయన ఆన్లైన్లో ప్రసంగిస్తూ ఆపరేషన్ సిందూర్ను మరోసారి ప్రస్తావించారు. భారత్ సామర్ధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పామని అన్నారు. అనేక వైమానిక స్థావరాలను ధ్వంసం చేశామని, ఎంతో వేగంగా, ఎంతో కచ్చితత్వంతో, ఎంతో నిర్ణయాత్మకంగా చర్య తీసుకోగలమని నిరూపించామని తెలిపారు.
బులెట్కు ఫిరంగులతో జవాబు
గత నెల 31న మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన ర్యాలీలో కూడా ప్రధాని ఆపరేషన్ సిందూర్ను వదలలేదు. అది మన మహిళల బలానికి శక్తివంతమైన చిహ్నంగా మారిందని చెప్పారు. దేశ చరిత్రలో ఆపరేషన్ సిందూర్ అతి పెద్ద, అత్యంత విజయవంతమైన ఉగ్రవాద నిరోధక చర్యగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. ‘మీరు బులెట్ పేలిస్తే మేము ఫిరంగులతో జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని 140కోట్ల మంది భారతీయులు ఒకే గొంతుకతో ప్రకటిస్తున్నారు’ అని మోడీ అన్నారు. కానీ ఆయన ఆపరేషన్ సిందూర్ను ఎందుకు విరమించారో చెప్పడం లేదు. ట్రంప్ మధ్యవర్తిత్వం గురించి ప్రస్తావించడం లేదు. ఆపరేషన్ సిందూర్ను నేనే ఆపానని ట్రంప్ పదేపదే ప్రకటనలు గుప్పిస్తున్నా నోరు విప్పడం లేదు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఎందుకు పట్టుకోలేకపోయారో చెప్పడం లేదు. పాకిస్తాన్ను నష్టపరిచిందెంతో, భారత్ నష్టపోయిందెంతో వివరించడం లేదు. ప్రతిపక్షాలు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు డిమాండ్ చేస్తే పట్టించుకోవడం లేదు. ఆయా ర్యాలీలలో మోడీ ప్రసంగాలను గమనిస్తే ఆయన తన ఇమేజ్ని పెంచుకోవడానికి మాత్రమే ఆపరేషన్ సిందూర్ను పదే పదే ప్రస్తావిస్తున్నారని అర్థమవుతుంది.
సిందూర్ ఖేల్తో ముడిపెట్టి…
వచ్చే సంవత్సరం పశ్చిమ బెంగాల్లో శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని మోడీ మే 29న అలీపూర్దార్ ర్యాలీలో ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ను… బెంగాల్లో దుర్గా నవరాత్రుల ముగింపునకు గుర్తుగా జరిగే కార్యక్రమం సిందూర్ ఖేలాతో పోల్చారు. ఉగ్రవాదులు మన సోదరీమణుల నుదిటి సిందూరాన్ని తుడిచివేసేందుకు ధైర్యం చేశారని, మన సైన్యం వారికి సిందూర్ శక్తిని చాటిచెప్పిందని అన్నారు. పాక్ ఊహించలేని విధంగా అక్కడి సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని చెప్పారు.
హామీ నెరవేర్చా
త్వరలో శాసనసభ ఎన్నికలు జరగాల్సిన మరో రాష్ట్రం బీహార్. అక్కడ మే 30న జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగిస్తూ పహల్గాం దాడి తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చానని, ప్రపంచానికి సిందూర శక్తిని చూపించామని చెప్పారు. ఉగ్రవాదులకు ఊతమిస్తున్న వారి శిబిరాలను నేలమట్టం చేస్తానని, వారు ఊహించిన దాని కంటే ఎక్కువ శిక్షే పడుతుందని ఈ రాష్ట్రంలోనే చెప్పానని గుర్తు చేశారు. ‘ఇవాళ మళ్లీ బీహార్ వచ్చాను. ఇచ్చిన హామీని నిలబెట్టుకొని వచ్చాను’ అని అన్నారు. పాకిస్తాన్లో కూర్చొని మన మహిళల నుదుటి తిలకాన్ని తుడిచేసిన వ్యక్తులను, వారు దాగివున్న శిబిరాలను మన సైన్యం ధ్వంసం చేసిందని తెలిపారు.
స్వావలంబన చేకూర్చాం
అదే రోజు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగిన సభలో కూడా మోడీ ప్రసంగించారు. ఏప్రిల్ 24న అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిం చాల్సి ఉండగా పహల్గాం దాడుల కారణంగా రద్దయ్యాయని చెప్పారు. ఉగ్రదాడిలో కాన్పూర్ కు చెందిన శుభం ద్వివేది ప్రాణాలు కోల్పో యాడని గుర్తు చేశారు. ఆయన కుమార్తె, ఇతర సోదరీమణుల ఆగ్రహాన్ని ఆపరేషన్ సిందూర్ రూపంలో ప్రపంచం మొత్తం చూసిందని అన్నారు. తన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ప్రచారం చేయడానికి ఆయన ఆపరేషన్ సిందూర్ను ఉపయోగించుకున్నారు. సైనిక చర్య భారత స్వదేశీ ఆయుధ శక్తిని రుచి చూపిందని తెలిపారు. ‘రక్షణ రంగంలో భారత్కు స్వావలంబన చేకూర్చడం మన ఆర్థిక వ్యవస్థకే కాదు…మన జాతికి కూడా గర్వ కారణం. ఇతరులపై దేశం ఆధారపడ కుండా చేయడానికి ఆత్మనిర్భర్ భారత్ను ప్రారంభిం చాం. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా చేస్తున్న ప్రయాణంలో ఉత్తరప్రదేశ్ ప్రధాన పాత్ర పోషించడాన్ని ఆయన కొనియాడారు.
8 రోజులు…6 రాష్ట్రాలు…9ర్యాలీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES