– చరిత్ర సృష్టించిన ముచ్చింతల్ ప్రాథమికోన్నత పాఠశాల
– వెంటనే గెజిటెడ్ హెచ్ఎం, టీచర్లను నియమిస్తాం
– రంగారెడ్డి జిల్లా డీఈవో సుశీందర్రావు
– విద్యార్ధులకు భోజనం యూనిఫామ్స్, పుస్తకాలు అందజేస్తాం
– కొత్త అడ్మిషన్లు నిలిపివేస్తున్నట్టు ప్రకటన
– ఆత్మస్థైర్యం కోల్పోతున్న ప్రయివేటు విద్యార్థులు
నవతెలంగాణ-శంషాబాద్
తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే పాఠశాలల పున: ప్రారంభం రోజున ప్రభుత్వ పాఠశాలలో భారీ సంఖ్యలో విద్యార్థులు చేరి చరిత్ర సృష్టించారు. గురువారం పాఠశాలలు ప్రారంభం కాగానే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ ప్రాథమికోన్నత పాఠశాలలో 800 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సుశీందర్రావు పాల్గొని విద్యార్థులకు అడ్మిషన్ ఇచ్చారు. అనంతరం ఎంఈఓ కె.లక్ష్మణ్నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుశీల, స్థానిక నాయకులతో పాఠశాల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ముచ్చింతల్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో గతేడాది 78 మంది విద్యార్థులు ఉన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి చుట్టుపక్కల గ్రామాలైన గొల్లూరు, మక్త, నాగిరెడ్డిపల్లి మాణిక్యమ్మగూడ, మదనపల్లి, మదనపల్లి తండా, గచ్చిబాయితండా, శంకరాపూర్, పులిమక్త వంటి గ్రామాల నుంచి విద్యార్థులు తరలివచ్చి అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలోనే ఒకేరోజు 800 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరడం అరుదైన విషయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల విద్యార్థుల తల్లిదండ్రులకు విశ్వాసం పెరగడం అభినందనీయమని, వారి ఆశలను వమ్ముచేయకుండా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ప్రభుత్వ విద్యార్థులకు విద్యా బోధనతో పాటు వారు భవిష్యత్తులో నిలదొక్కుకునే అన్ని విషయాలపై అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈ కారణంగానే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొని ముందుకు వెళ్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేధా(ఏఐ) అభివృద్ధి చేసేందుకు డిజిటల్ ల్యాబ్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రయివేటు పాఠశాలల్లో పిల్లలకు చదువుపైనే ధ్యాస కల్పించడం మాని మార్కులు, ర్యాంకుల కోసం పోటీ పడుతున్నారనీ, వారు భవిష్యత్తులో దృఢంగా నిలదొక్కుకునే విధంగా విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయడం లేదని తెలిపారు. దాంతో ఏ చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలకు తమ తల్లిదండ్రులే హీరో, హీరోయిన్లు కావాలన్నారు. తల్లిదండ్రుల అభిప్రాయాలను, ఆశలను పిల్లల మీద రుద్దొద్దని, వారికి స్వేచ్ఛనివ్వాలని సూచించారు. ముచ్చింతల్ ప్రాథమికోన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయునితో పాటు విద్యార్థుల సంఖ్యకనుగుణంగా ఉపాధ్యాయులను వెంటనే నియమిస్తామని ప్రకటించారు. విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం ఉంటుందన్నారు. ప్రయివేటు సంస్థ సహకారంతో నాలుగు వాహనాలతో రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఇక్కడ విద్యార్థులకు ఎన్సీసీ ఏర్పాటు చేస్తామన్నారు.
స్కూల్లో ప్రస్తుత తరగతి గదులు 878 మందికి సరిపోతాయని, అంతకంటే ఎక్కువ అయితే ఇబ్బంది కాబట్టి అడ్మిషన్లు నిలిపి వేస్తున్నామని ప్రకటించారు. మండల సమాఖ్య ఏపీఎం అహల్య ఆధ్వర్యంలో అంతకు ముందే విద్యను అభ్యసిస్తున్న 78 మంది విద్యార్థులకు యూనిఫామ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.సుశీల, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ మాధవి, మాజీ సర్పంచ్లు బీర్ల పెంటయ్య, సుజాత చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
ఒకే రోజు 800 అడ్మిషన్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES