నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడులో 2019 పొల్లాచ్చి లైంగిక వేధింపుల కేసులో కోయంబత్తూరులోని మహిళా కోర్టు మంగళవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో మొత్తం 9మంది నిందితులను దోషులుగా నిర్థారిస్తూ జీవిత ఖైదు విధించింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత జస్టిస్ ఆర్. నందిని దేవి నిందితులకు జీవితఖైదు విధిస్తున్నట్లు ప్రకటించారు. లైంగిక వేధింపుల నుండి బయటపడిన ఎనిమిదిమంది బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.85 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
దోషులు శబరిరాజన్ అలియాస్ రిష్వంత్, తిరునావుకరసు, టి.వసంతకుమార్, ఎం.సతీష్, ఆర్.మణి అలియాస్ మణివన్నన్, పి.బాబు, హరోన్పాల్, అరుళనంతం, అరుణ్కుమార్లు 2019లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయినప్పటి నుండి నిందితులు సేలం సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. భారీ పోలీసు భద్రత మధ్య వారిని సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు.
దోషులు కళాశాల విద్యార్థినితో పాటు సుమారు తొమ్మిది మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. 2016 మరియు 2018 మధ్య ఈ నేరాలు జరిగాయని, అత్యాచారాలను వీడియో తీశారని, బాధితులను నగదు కోసం బ్లాక్మెయిల్ చేయడంతో పాటు పదేపదే అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మొదట పొల్లాచ్చి పోలీసులు దర్యాప్తు చేసిన ఈ కేసును తర్వాత తమిళనాడు సిబి-సిఐడికి, ఆ తర్వాత సిబిఐకి బదిలీ చేశారు.
2019లో అన్నాడిఎంకె ప్రభుత్వం ఆరోపణలను తిరస్కరించడంతో పాటు ఈ కేసును కప్పిపుచ్చేందుకు యత్నించింది. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు ఆలస్యం కావడంతో పలు విమర్శలను ఎదుర్కొంది. అనంతరం నిందితులపై అత్యాచారం, సామూహిక అత్యాచారం, ఒకే బాధితురాలిపై పదేపదే అత్యాచారం, నేరపూరిత కుట్ర, లైంగిక వేధింపులు, బ్లాక్మెయిల్ కింద కేసులు నమోదయ్యాయి.