నవతెలంగాణ-జనగామ
రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని హైద్రాబాద్ జిల్లా కార్యదర్శి ఈర్రి అహల్య డిమాండ్ చేశారు. మంగళవారం అఖిల భారత ప్రజాతంత్రం మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఐద్వా జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట మహిళలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అహల్య మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని పట్టణలల్లో అమలు చేయాలని,అలాగే రేషన్ షాపులల్లో 14 రకాల సరుకులు అందించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని ఉంటాయని పేదలు కనీసం ఒక పూట కడుపునిండా తినలేని పరిస్థితి ఉందన్నారు. కూలీలు చేయడానికి పని లేదని, ఉపాధి అవకాశాలు లేక మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. సరియైన తిండి లేక పోషకాహార లోపంతో మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు అన్నారు. ఒకరోజు పనిచేస్తే వచ్చిన కూలీ డబ్బులు కనీసం ఆ కుటుంబం ఒక పూట తిండి తినలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే సరియైన తిండి తినాలని డాక్టర్లు పాలు పండ్లు గుడ్లు మాంసం తినాలని చెప్తున్నారు అన్నారు.కానీ ఈ పెరిగిన ధరలను చూస్తే ఉప్పు కారం మెతుకులు తప్ప ఇంకేం పోషకాహారాలు తినగలరా అని ప్రశ్నించారు. అల్లం ఎల్లిగడ్డలు 200 రూపాయల కిలో చొప్పున ఉల్లిగడ్డలు 50 రూపాయలు కిలో కొని, కూరగాయలు కిలో 100 రూపాయలకు తక్కువ లేవన్నారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అన్నారు. ప్రభుత్వానికి ప్రజల బాధలు కనిపించట్లేదా అని ప్రశ్నించారు.ప్రజలు బాధలు మరిచిపోవాలంటే బార్ షాపుల్ని ఓపెన్ చేశారని మూడు నెలల ముందే మద్యం షాపులకు టెండర్లు పెట్టి కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖజానా నింపుకొంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర కొండంత పెంచి గోరంత తగ్గించి గ్యాస్ ధర తగ్గించామని గొప్పలు చెప్పుకుంటున్నారు అన్నారు. ఎన్నికల ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ గెలవడం కోసం అమలు కాని వాగ్దానాలు చేస్తూ గెలవడం కోసం కళ్ళబోల్లి మాటలు చెప్పుతున్నారని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేకుంటే మహిళలే ఈ ప్రభుత్వాలను గద్దె దించుతారని హెచ్చరించారు. ధర్నా అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ సెక్షన్ ధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చీర రజిత, సహాయ కార్యదర్శి పందిళ్ళ కళ్యాణి, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పొన్నాల ఉమా, కొండ వరలక్ష్మి, బి సిహెచ్ శ్రీలత, అంజమ్మ, ఎండి గౌసియా, అనిత, శిరీష, వై అనిత, జి మానస తదితరులు పాల్గొన్నారు.