నవతెలంగాణ-హైదరాబాద్: ప్రతి దీపావళికి బాణాసంచాలో కొత్త ట్రెండ్ను పరిచయం చేస్తుంటారు వ్యాపారులు. రాకెట్లు, స్పార్కర్స్ వంటివి ఈ తరహాలో సరికొత్తగా రూపొందించినవే. అయితే ఈ ఏడాది పరిచయం చేసిన ‘కార్బైడ్ గన్’, లేదా ‘దేశీయ బాణాసంచా’ మధ్యప్రదేశ్లో చిన్నారులకు ప్రాణాంతకంగా మారాయి. కార్బైడ్ గన్ కారణంగా కేవలం మూడు రోజుల్లోనే 122మందికి పైగా చిన్నారులు ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. తీవ్ర కంటి గాయాలతో ఆస్పత్రిలో చేరగా, 14మంది కంటి చూపు కోల్పోయారని అన్నారు. ఈ కార్బైడ్గన్తో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన జిల్లా విదిష. భోపాల్, ఇండోర్, జబల్పూర్ మరియు గ్వాలియర్లోని ఆస్పత్రుల్లో కంటి వార్డులు చిన్నారులతో నిండిపోయాయి. భోపాల్లోని హమీడియా ఆస్పత్రిలో మాత్రమే, 72 గంటల్లో 26మంది పిల్లలు చేరారు.
ఇవి బొమ్మ పరికరాలు కాదని, ఇంప్రూవైజ్డ్ పేలుడు పదార్థమని హమీడియా ఆస్పత్రి సిఎంహెచ్ఒ డాక్టర్ మనీష్ శర్మ తెలిపారు. ఈ పరికరం కళ్లకు తీవ్రంగా హాని కలిగిస్తుందని, పేలుడు కారణంగా వెలువడే లోహపు శకలాలు రెటీనాకు ప్రమాదమని హెచ్చరించారు. ఇవి శాశ్వత అంధత్వానికి దారితీయవచ్చని అన్నారు. కొంతమంది ఐసియులో చికిత్స పొందుతున్నారని, చాలా మందికి కంటిచూపు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ గన్లను అక్రమంగా విక్రయించిన ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు విదిష ఇన్స్పెక్టర్ తెలిపారు. ఇన్స్టాగ్రామ్స్, యూట్యూబ్ వీడియోలతో ఈ ప్రమాదకరమైన ట్రెండ్ వేగవంతమైందని అన్నారు. ‘ఫైర్ క్రాకర్ గన్ ఛాలెంజ్’ అని ట్యాగ్ చేయబడిన వీడియోలు వైరల్గా మారడంతో .. చిన్నారులు ఎక్కువ మంది వీటిని కొనుగోలు చేశారని చెప్పారు.
కంటిచూపుకు ప్రమాదకరమైన ఈ కార్బైడ్ గన్లపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 18న నిషేధం విధించి చేతులు దులుపుకుంది. స్థానిక మార్కెట్లలో ముడి కార్బైడ్ గన్లను బహిరంగంగా విక్రయించినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారు. రూ.150 నుండి రూ.200కు వీటిని విక్రయించారు.