నవతెలంగాణ-హైదరాబాద్ : కర్నూలులో కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంతోపాటు శివార్లలో విస్తృతంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. డ్రంకన్ డ్రైవ్, బీమా, ఫిట్నెస్, పర్మిట్ పత్రాలు, బస్సు లోపల భద్రతను పరిశీలిస్తున్నారు. పర్మిట్ లేకుండా వెళ్తున్న బస్సులపై, నిబంధనలు పాటించని పలు బస్సులపై కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా నడుపుతున్న ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు.
రాజేంద్రనగర్, ఎల్బీనగర్ చింతలకుంటలో ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న బస్సులను తనిఖీ చేస్తున్నారు. బస్సుల్లో ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను పరిశీలిస్తున్నారు. రాజేంద్రనగర్లో నిబంధనలు పాటించని ఐదు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదుచేశారు. చింతలకుంట వద్ద నిబంధనలు ఉల్లంఘించిన ఓ ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. మరో నాలుగు బస్సులపై కేసులు నమోదుచేశారు.



