నవతెలంగాణ-హైదరాబాద్: మొంథా తుపాను తీరం వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఎపిలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పోర్టులకు హెచ్చరికల స్థాయిని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం పెంచింది. కాకినాడ పోర్టుకు ఏడో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. విశాఖపట్నం, గంగవరం పోర్టులకు ఆరు, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుకు ఐదో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
కాకినాడలో ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేసేందుకు 40 బోట్లను, వంద మంది సిబ్బందిని, 140 గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. 50 మందితో ఎస్డిఆర్ఎఫ్, 30 మందితో ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే కాకినాడకు చేరుకున్నాయి. జిల్లాలో 269 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రతి కేంద్రానికి ఇన్ఛార్జులను నియమించారు. ఈ నెల 31 వరకూ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కాకినాడ జిల్లాలో ఆరు వేల ఎకరాలు, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 7,500 ఎకరాలు, తూర్పు గోదావరి జిల్లాలో 2,500 ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైనట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.



