నవతెలంగాణ ముంబై: ఒక వ్యక్తి సుమారు 20 మంది పిల్లలను స్టూడియోలో నిర్బంధించాడు. తన డిమాండ్ల కోసం కొందరితో మాట్లాడాలంటూ వీడియో రిలీజ్ చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చివరకు పోలీస్ కాల్పుల్లో ఆ వ్యక్తి మరణించాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. పోవై ప్రాంతంలోని ఆర్ఏ స్టూడియోలో యాక్టింగ్ క్లాసులు జరుగుతుంటాయి.
కాగా, రోహిత్ ఆర్య అనే వ్యక్తి ఆ స్టూడియోలో పని చేస్తున్నాడు. అతడికి యూట్యూబ్ ఛానెల్ కూడా ఉన్నది. గత నాలుగు రోజులుగా రోహిత్ ఆడిషన్లు నిర్వహిస్తున్నాడు. దీంతో గురువారం ఉదయం సుమారు వంద మంది పిల్లలు ఆడిషన్ల కోసం ఆ స్టూడియోకు వచ్చారు. అయితే 80 మంది పిల్లలను అతడు బయటకు వెళ్లనిచ్చాడు. సుమారు 20 మంది పిల్లలను స్టూడియో లోపల ఉంచి నిర్బంధించాడు. దీంతో తమను కాపాడాలంటూ వారు హాహాకారాలు చేశారు.
మరోవైపు రోహిత్ ఆర్య ఆ తర్వాత ఒక వీడియో క్లిప్ విడుదల చేశాడు. కొంత మంది వ్యక్తులతో మాట్లాడటం కోసమే పిల్లలను బందీలుగా ఉంచినట్లు తెలిపాడు. తనకు పెద్దగా ఆర్థిక డిమాండ్లు లేవని చెప్పాడు. తన డిమాండ్లు నైతికమైనవని అన్నాడు. పోలీసులు, అధికారులు దూకుడుగా వ్యవహరించవద్దని, తనను రెచ్చగొట్టవద్దని హెచ్చరించాడు. తన డిమాండ్లు నెరవేర్చకపోతే ఆ ప్రాంగణానికి నిప్పు పెడతానని, తనతో పాటు పిల్లలకు హాని జరుగుతుందని వార్నింగ్ ఇచ్చాడు.
కాగా, పిల్లల కిడ్నాప్, నిర్బంధం గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పెద్ద సంఖ్యలో ఆ స్టూడియో ముందు గుమిగూడారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. పిల్లలను కిడ్నాప్ చేసి నిర్బంధించిన రోహిత్ ఆర్యతో మాట్లాడారు.
మరోవైపు పిల్లలందరినీ రక్షించి వారి కుటుంబాలకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అతడు ఎందుకు ఇలా చేశాడు అన్నది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆ వ్యక్తి మానసికంగా అస్థిరంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే పోలీస్ కాల్పుల్లో గాయపడిన అతడ్ని హాస్పిటల్కు తరలించగా మరణించాడు. ఈ సంఘటన ముంబైలో కలకలం రేపింది.



