నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ ఇరు దేశాల అధినేతలు డొనాల్డ్ ట్రంప్, షీ జిన్పింగ్ల భేటీ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దక్షిణ కొరియా వేదికగా వీరిద్దరూ గురువారం భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు అంతర్గతంగా సమావేశమైన వీరు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. జిన్పింగ్తో భేటీ అనంతరం ట్రంప్ కీలక ప్రకటన చేశారు. చైనాపై టారిఫ్లను 10శాతం మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
‘‘జిన్పింగ్ తో భేటీ అద్భుతంగా జరిగింది. మా సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఫెంటనిల్ తయారీలో వాడే ముడి ఉత్పత్తుల రవాణాను కట్టడి చేసేందుకు జిన్పింగ్ తీవ్రంగా శ్రమిస్తారని నేను విశ్వసిస్తున్నా. అందుకే ఫెంటనిల్ పేరుతో చైనాపై విధించిన 20శాతం సుంకాలను 10శాతానికి తగ్గిస్తున్నా. దీంతో బీజింగ్పై మొత్తం టారిఫ్లు 57శాతం నుంచి 47శాతానికి దిగి రానున్నాయి. ఇక, అమెరికా సోయాబీన్ ఉత్పత్తుల కొనుగోళ్లను చైనా తక్షణమే పునరుద్ధరించేందుకు అంగీకారం కుదిరింది’’ అని ట్రంప్ వెల్లడించారు.
ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడిపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. జిన్పింగ్ గొప్ప నేత అని, ఆయనకు 10కి 12 మార్కులు ఇస్తానని అన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో తాను చైనాలో పర్యటిస్తానని వెల్లడించారు. ఆ తర్వాత వీలు చూసుకుని జిన్పింగ్ కూడా అమెరికాకు వస్తారని అన్నారు.



