Thursday, May 15, 2025
Homeప్రధాన వార్తలుఫోన్‌.. బ్యాన్‌..!

ఫోన్‌.. బ్యాన్‌..!

- Advertisement -

– ప్రభుత్వ పాఠశాలల్లో ఆంక్షలు..!
– సెల్‌ఫోన్‌ వాడొద్దంటూ విద్యాశాఖ ఆదేశాలు
– అతిక్రమించే వారిపై చర్యలు
– వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి..
– ఉపాధ్యాయుల్లో భిన్నాభిప్రాయాలు
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సెల్‌ఫోన్‌ వినియోగించడంపై ఆంక్షలు విధించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. తరగతి గదిలో సెల్‌ఫోన్‌ వినియోగించకుండా చూడాలని ఇప్పటికే విద్యాశాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. జిల్లా అధికారులు స్కూళ్లను తనిఖీ చేసి, సెల్‌ఫోన్‌ వాడే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా విద్యాశాఖ స్పష్టం చేసింది. దాంతో పాఠశాలలో సెల్‌ఫోన్‌ వాడకంపై ఉపాధ్యాయుల్లో చర్చ నడుస్తోంది. ఈ నిర్ణయంపై వారిలో భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది.
జి. రేణు యాదవ్‌

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు అన్నీ కలిపి 505 ఉండగా, మరో 1500 వరకు ప్రయివేటు, కార్పొరేట్‌ స్కూల్స్‌ ఉన్నాయి. ఇందులో దాదాపు లక్ష మంది విద్యార్థులు చదువుతున్నారు. 3 వేల పైచిలుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. చాలా మంది ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేస్తూ, తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అయితే కొద్దిమంది మాత్రం పాఠశాలకు వచ్చినా నిరంతరం ఫోన్‌లోనే మునిగి తేలుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లినప్పుడు కొందరు టీచర్లు సెల్‌ఫోన్‌లో సంభాషణలు, చాటింగ్‌లతో కాలక్షేపం చేస్తుండటాన్ని చూసి తల్లిదండ్రులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి కొందరి మూలంగా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం సడలుతోందన్న విమర్శలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు పాఠశాలల్లో సెల్‌ఫోన్‌ వాడకంపై ఆంక్షలు విధించేందుకు చర్యలు చేపట్టారు. ఇటీవల జరిగిన విద్యాశాఖ అధికారుల సమావేశంలో తరగతి గదిలో ఏ ఉపాధ్యాయుడు కూడా సెల్‌ఫోన్‌ వాడకూడదంటూ ఆదేశాలివ్వాలనీ, ఆకస్మిక తనిఖీలు చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కొందరి వల్ల అందరికీ చెడ్డపేరు..!
ఉపాధ్యాయుల్లో చాలా మంది విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు శ్రమిస్తున్నారు. కొందరైతే ప్రత్యేక తరగతులు కూడా తీసుకోవడం.. విద్యార్థులను వారికి ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహించడం ద్వారా వారిలోని నైపుణ్యాన్ని వెలికితీస్తూ వారికి వెన్నంటూ నిలుస్తున్నారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వివిధ రంగాల్లో దూసుకుపోతున్నారు. ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ఆయా రంగాల్లో విజయవంతం అవుతున్నారు. వారికి గైడ్‌గా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులు చేస్తున్న శ్రమ వల్లే విద్యార్థులు రాణిస్తున్నారు. అయితే ఇంత కష్టపడుతున్న ఉపాధ్యాయులు ఒకవైపు ఉంటే, కొందరు మాత్రం పాఠశాలలకు రాకుండా రాజకీయాలతో కాలక్షేపం చేస్తూ విధులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒకరిద్దరు డుమ్మాల మాస్టర్లు, బిజినెస్‌ టీచర్ల ధోరణితో మిగతా వారికీ చెడ్డపేరు వస్తోంది. ఆ కొందరిపై అధికారుల అజమాయిషీ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందనే భావన అందరిలోనూ ఉంది. అధికారులను మేనేజ్‌ చేసుకుని పాఠశాలకు డుమ్మా కొట్టి సొంత వ్యాపకాల్లో మునిగిపోయి కొందరు, పాఠశాలకు వచ్చినా తమ వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలపై సెల్‌ఫోన్‌లలో నిమగమవుతూ మరికొందరు ఉంటున్నారు.
ఉపాధ్యాయులపై ఫిర్యాదులు
ఉపాధ్యాయులు పాఠశాలల్లో మొబైల్‌ ఫోన్లను అతిగా వినియోగిస్తున్నారని విద్యాశాఖకు ఫిర్యాదులు అందాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఉపాధ్యాయులు తరగతి సమయంలో మొబైల్‌ ఫోన్లలో నిమగమవడం వల్ల బోధన-అభ్యసన ప్రక్రియకు ఆటంకం కలుగుతోందని విద్యాశాఖ గుర్తించింది. ఇటీవల హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఎఆర్డీలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో డీఈవోలు, డైట్‌ ప్రిన్సిపాళ్లకు పాఠశాలల్లో మొబైల్‌ నిషేధంపై దిశానిర్దేశం చేశారు. జిల్లా విద్యాధికారులు ఈ ఉత్తర్వులను జారీ చేయాలని నిర్దేశించారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ కార్యదర్శి తరగతి గదుల్లో మొబైల్‌ ఫోన్‌ వినియోగాన్ని నిషేధించాలని ఆదేశించారు. జూన్‌ నుంచి ఈ ఆదేశాలు పటిష్టంగా అమలు చేయాలని పేర్కొన్నారు.
సెల్‌ వద్దంటే ఎలా..?
పాఠశాలల్లో సెల్‌ఫోన్‌ వాడొద్దన్న విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలపై ఉపాధ్యాయులు భిన్నంగా స్పందిస్తున్నారు. సెల్‌ఫోన్‌ వాడకుండా ఉండటమే మంచిదని కొందరు అంటుండగా, మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి అత్యవసర పరిస్థితుల్లో కాల్‌ వస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించి విద్యార్థుల హాజరు విషయంలో ఫేస్‌ రికగ్నైజేషన్‌కు సెల్‌ఫోన్‌ వాడాల్సి ఉంటుందనీ, చాలా సమాచారం ఫోన్ల ద్వారానే పంపుతామని పేర్కొంటున్నారు. సెల్‌ఫోన్‌ వాడొద్దంటే ఈ పనులన్నీ ఎలా చేయాలన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఫేస్‌ రికగ్నైజేషన్‌, ఆన్‌లైన్‌ వర్క్స్‌ కోసం ట్యాబ్స్‌ గానీ, ఇతర పరికరాలు గానీ అందిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -