నవతెలంగాణ-హైదరాబాద్: SLBCపై సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ను పనికట్టుకుని స్వయం ప్రకటిత మేధావులు బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. 1982లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జీఓ నంబర్ 306 ద్వారా శ్రీశైలం జలాలపై సర్వే చేయాలని చెప్పిందని, 1994 లోనే SLBC టన్నెల్ తవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చిందని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వివరించారు. 2014 వరకు ఎందుకు SLBC టన్నెల్ పనులను కాంగ్రెస్,టీడీపీ ప్రభుత్వాలు ఎందుకు పూర్తి చేయలేదని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో రైతులు పత్తిని తగలబెడుతున్నారని, వరి ధాన్యం తడిసిపోయి, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలియజేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని ఆయాన దీమా వ్యక్తం చేశారు. ఈ ప్రెస్ మీట్లో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు ,కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె.కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.



