నవతెలంగాణ-హైదరాబాద్ : కేరళ వాటర్ అథారిటీ ఫీడర్ ట్యాంక్ సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా కుప్పకూలింది. కేరళలోని తమ్మనం అనే ప్రాంతంలో ఉన్న కేడబ్ల్యూఏ నీటి ట్యాంక్ కూలడంతో 1.38 కోట్ల లీటర్ల నీరు ఒక్కసారిగా జనావాసాలపై గుమ్మరించినట్లు పడిపోయింది. దీంతో అనేక ఇండ్లు వరదలో చిక్కుకున్నాయి. ఈ హఠాత్ పరిణామంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నీరు ఉద్ధృతంగా రావడంతో పలు ఇండ్ల పైభాగాలు కూలిపోయాయని.. అనేక వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయని అధికారులు పేర్కొన్నారు.
తెల్లవారుజామున 2 గంటలకు కేడబ్ల్యూఏ ఫీడర్ పంప్ హౌస్లోని వాటర్ ట్యాంక్లో కొంత భాగం కూలిపోవడంతో ఈ సంఘటన జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న ఇండ్లల్లోకి భారీగా నీరు చేరడంతో అనేక ఎలక్ట్రిక్ పరికరాలు, ఫర్నిచర్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. సమీపంలోని ఆరోగ్య కేంద్రంలోకి నీరు చేరడంతో పెద్ద మొత్తంలో మందులు, వైద్య పరికరాలు పాడైనట్లు అధికారులు తెలిపారు. ఈ ట్యాంక్ను 50 ఏళ్ల క్రితం నిర్మించారని.. దీనినుంచి కొచ్చి, త్రిపునితుర ప్రాంతాలకు నీరు సరఫరా అవుతుందని ఎర్నాకుళం ఎమ్మెల్యే వినోద్ వెల్లడించారు. వరద వల్ల ప్రభావితమైన ప్రజలకు నష్టపరిహారం చెల్లించాలని కేడబ్ల్యూఏను కోరారు. కొచ్చి, ఇతర ప్రాంతాలకు నీటి సరఫరా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు కేడబ్ల్యూఏ అధికారులు తెలిపారు.



