– మరో రూ.2,130 తగ్గుదల
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సానుకూల వాతావరణం నెలకొనడంతో బంగారం ధరలు దిగివస్తోన్నాయి. మరోవైపు డిమాండ్ తగ్గడంతో గురువారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.2,130 తగ్గి రూ.94,080గా పలికింది. గుడ్ రిటర్న్స్ ప్రకారం.. 22 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడిపై రూ.1,950 తగ్గి రూ.86,250కి దిగివచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల ధర రూ.93,930గా, 22 క్యారెట్ల ధర రూ.86,100గా నమోదయ్యింది. మరోవైపు తాజాగా కిలో వెండిపై రూ.900 తగ్గి రూ.97,000గా చోటు చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్గోల్డ్ ఔన్సు 16 డాలర్లు తగ్గి 3160 డాలర్ల వద్ద, వెండి ఔన్సు 32 డాలర్ల వద్ద నమోదయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లో ఏప్రిల్లో ఔన్సు 3500 డాలర్ల వరకు వెళ్లింది. తాజాగా పసిడి దాదాపు 10 శాతం క్షీణించి 3150 డాలర్ల స్థాయికి దిగి వచ్చింది. కాగా.. బంగారం ఇప్పటి వరకు ఆల్టైమ్ గరిష్ఠాల నుంచి భారీగా క్షీణించింది. దేశీయంగా రూ.1లక్ష మార్కు దాటిన బంగారం ధరలు ఇటీవల దాదాపు రూ.7-8 వేల మేర దిగిరావడంతో కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగిస్తోంది. భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా ఇన్నాళ్లు సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి మదుపర్లు బంగారంలో మదుపు చేయడంతో ఈ లోహానికి డిమాండ్ ఏర్పడటంతో పసిడి ధరలు ఎగిశాయి. అమెరికా, చైనా దేశాలు వాణిజ్య యుద్ధానికి స్వస్తి చెప్పి..ఓ ఒప్పందానికి రావడం, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగింపు సంకేతాలు బంగారం ధర తగ్గుదలకు ప్రధాన కారణం.
దిగొస్తున్న బంగారం..
- Advertisement -
- Advertisement -