– పరివాహక ప్రాంత రైతుల ఆందోళన
– అధికారుల కనిసన్న లోని సాగుతుందంటూ ఆరోపణలు
నవతెలంగాణ-పరకాల : పరకాల కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.ఇటీవలి కాలంలో గృహ నిర్మాణాలు ఊపందుకోవడంతో చలివాగులో క్వారీలు ఏర్పరచుకుని కొంతమంది ట్రాక్టర్ల ద్వారా పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నారు. చలివాగు నుండి ఇసుక తరలిస్తుండడంతో పరివాహక ప్రాంత వ్యవసాయ భూముల యజమానులు వర్షాకాలంలో వాగు ఉధృతి కారణంగా తమ భూములు కోతకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న వ్యవహారం అధికారుల కనుసన్నుల్లోనే సాగుతున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. చలి వాగు పరివాహక ప్రాంత రైతులు అధికారులకు ఫోన్ చేసి తమ గోడు వెళ్ళబోసుకున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ వ్యవహారంపై ఇసుక అక్రమ రవాణా దారులను ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసుల అండదండలు తమకు ఉన్నట్లు బెదిరిస్తున్నారని పలువురు వాపోతున్నారు.
ఎటు చూసినా రెండు కిలోమీటర్ల పొడవు కూడా లేని వాగు నుండి ఇసుక తరలించడం వాగు సమీపరైతులను ఆందోళనకు గురిచేస్తుంది. పంట పొలాలు బుంగలు పడి పొలానికి అందాల్సిన సాగునీరు వాగులో కలుస్తుందంటూ ఆవేదన చెందుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవలసిన అవసరం ఉందని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై పరకాల తాసిల్దార్ విజయలక్ష్మి వివరణ కోసం ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.



