నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు చెన్నైలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా పలువురు సినీ ప్రముఖులకు వరుస బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు వెంటనే తనిఖీలు చేపట్టారు.
సీఎం ఎంకే స్టాలిన్తోపాటూ ప్రముఖ నటులు అజిత్ కుమార్ , అరవింద్ స్వామి , ఖుష్బూ నివాసాలను ఆదివారం రాత్రి బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. డీజీపీ కార్యాలయానికి ఆ బెదిరింపు మెయిల్ వచ్చింది. బెదిరింపు మెయిల్తో అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారి నివాసాల వద్దకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో క్షుణ్ణంగా తనిఖీల చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. దీంతో అది బూటకపు బెదిరింపుగా పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



