నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలో రోజురోజుకు గాలి నాణ్యత పడిపోతున్న విషయం తెలిసిందే. గాలి కాలుష్యం కారణంగా ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేశారు. అంతకుముందు కృత్రిమ వర్షాలు కురిపించి దేశరాజధానిలో వాయు కాలుష్యాన్ని తగ్గించాలని ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ఎటువంటి ప్రయోజనం కలుగలేదు.
తాజాగా రేఖా గుప్తా సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో స్కూల్స్లో స్పోర్ట్స్ యాక్టివిటీస్ను నిషేధిస్తూ నిర్ణయించింది. పెరిగిపోతున్న వాయుకాలుష్యం నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం.. శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, వాయు కాలుష్యంలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ కారణంగా విద్యార్థులు, ప్రజలకు శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్న విషయం తెలిసిందే.
కాగా, దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్య తీవ్రమైంది. ఈ నేపథ్యంలో.. పాఠశాలల స్పోర్ట్స్, అథ్లెటిక్స్ కార్యక్రమాలను వాయిదా వేసేలా ఆదేశించడాన్ని పరిశీలించాలని ‘వాయునాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM)’కు సుప్రీం కోర్టు సూచించింది. ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు కాలుష్యంపై దాఖలైన ఓ పిటిషన్పై విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
నవంబరు, డిసెంబరు నెలల్లో అండర్-16, అండర్-14 విద్యార్థులకు ఇంటర్ జోనల్ క్రీడా పోటీలు నిర్వహించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైనట్లు సీనియర్ న్యాయవాది, అమికస్ క్యూరీ అపరాజిత సింగ్ సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కాలుష్యం గరిష్ఠ స్థాయిలో ఉండే ఈ నెలల్లో ఇటువంటి ఈవెంట్స్కు అనుమతించడం.. స్కూల్ పిల్లలను గ్యాస్ ఛాంబర్లో ఉంచడంతో సమానమేనని వాదించారు. ఈ సమయంలో బహిరంగ క్రీడా కార్యకలాపాలు నిర్వహించడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్లతో కూడిన సుప్రీం ధర్మాసనం.. వాయు కాలుష్యం తక్కువగా ఉండే నెలల్లో క్రీడాపోటీలు నిర్వహించేలా స్కూళ్లను ఆదేశించాలని ‘సీఏక్యూఎం’కు సూచించింది



