నవతెలంగాణ – హైదరాబాద్: హాంకాంగ్లోని తాయ్ పో ప్రాంతంలో ఉన్న వాంగ్ ఫుక్ కోర్ట్ నివాస సముదాయంలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కనీసం 44 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని హాంకాంగ్ పోలీసులు గురువారం మీడియా సమావేశంలో ధ్రువీకరించారు. ఈ ఘటనకు సంబంధించి నరహత్య ఆరోపణల కింద ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు హాంకాంగ్ పోలీసులు తెలిపారని చైనా వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది.
హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇంకా 279 మంది గల్లంతయ్యారని, 29 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక కాలమానం ప్రకారం 2:51 గంటలకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సాయంత్రం 6:22 గంటలకు దీనిని నెం.5 స్థాయి ప్రమాదంగా ప్రకటించారు. ఒక భవనంలో మొదలైన మంటలు ఏడు ఇతర భవనాలకు వ్యాపించాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.



