నవతెలంగాణ-హైదరాబాద్: హాంకాంగ్ అగ్నిప్రమాదం మరణాల సంఖ్య పెరుగుతోంది. బహుళ అంతస్థుల్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇప్పటి వరకు 128మంది చనిపోయారని.. పలువురి ఆచూకీ గల్లంతైనట్లుగా అధికారులు తెలిపారు. తప్పిపోయిన వందలాది మంది ఆచూకీ కోసం గాలిస్తున్నట్లుగా అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. ఇక తమ వారి ఆచూకీ కోసం వందలాది మంది నిరీక్షిస్తున్నారు. సజీవదహనం కావడంతో గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు ఉన్నాయి.
ఇక అగ్నిప్రమాదంపై హాంకాంగ్ అధికారులు విచారణ చేపట్టారు. అయితే ప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలియకపోయినా…మెష్, ప్లాస్టిక్ షీట్లు కారణంగా మంటలు వేగంగా వ్యాపించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా సాంప్రదాయ నిర్మాణ సామగ్రి అయిన వెదురు స్కాఫోల్డింగ్ కూడా మంటలకు ఆజ్యం పోసిందని పేర్కొన్నారు.
హాంకాంగ్లోని తాయ్ పో జిల్లాలోని వాంగ్ ఫక్ కోర్టు రెసిడెన్షియల్ ఎస్టేట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున మంటలు శరవేగంగా సమీపంలోని భవనాలకు కూడా విస్తరించాయి. దీంతో తప్పించుకునే మార్గం లేకపోవడంతో అనేక మంది ఊపిరాడక ప్రాణాలు పోయాయి. ఇక ప్రమాదానికి కారణంగా భావించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.



