నవతెలంగాణ-హైదరాబాద్ : విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ఆదివారం మధ్యాహ్నం ప్రమాదం చోటుచేసుకుంది. ఫలితంగా బ్లాస్ట్ఫర్నెస్-2లో సుమారు 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలైంది. ఫర్నెస్ నుంచి టర్బో ల్యాడిల్ కార్లోకి (టీఎల్సీ) ద్రవ ఉక్కును నింపి, ఎస్ఎంఎస్కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంతలో ఒక్కసారిగా టీఎల్సీకి రంధ్రం పడి ద్రవ ఉక్కు కిందపడిపోయింది. ఈ ఘటనలో కేబుల్స్ కాలిపోయి, ట్రాక్ దెబ్బతింది. ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేసి ట్రాక్ మీద పడిన ఉక్కును, ల్యాడిల్ కార్ను తొలగించే పనులు చేపట్టారు. కాగా.. టీఎల్సీకి ఇటీవలే రిఫ్రాక్టరీ లైనింగ్ వేసి సిద్ధం చేశారు. అది సుమారు 1,050 హీట్ల వరకు పని చేయాల్సి ఉండగా, 500 హీట్లకే రంధ్రం పడిపోవడంతో లైనింగ్ పనుల్లో నాణ్యత కొరవడిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, నిపుణులైన సిబ్బందితో పనులు చేయించాలని స్టీల్ ఇంటక్ అధ్యక్షుడు పి.వి.రమణమూర్తి, సీటూ ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి డిమాండ్ చేశారు.
విశాఖ స్టీల్లో తప్పిన పెను ప్రమాదం.. 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES