– 962 పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది కేటాయింపు
– జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక అలా
నవతెలంగాణ పాల్వంచ
శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే పిఓ, ఎపిఓ, ఓపిఓల కేటాయింపునకు మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించినట్టు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు. గురువారం ఐడీఓసీ మినీ సమావేశపు హాలులో ఎన్నికల సంగం ఆదేశాల మేరకు నియోజకవర్గాలకు సిబ్బంది కేటాయింపునకు ఆన్లైన్ ద్వారా ర్యాండమైజేషన్ చేసినట్లు చెప్పారు. రెవెన్యూ జిల్లా పరిధి ఆధారంగా ఐదు నియోజకవర్గాల పరిధిలో 962 పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది కేటాయింపు చేసినట్లు చెప్పారు. జూలూరుపాడుకు మన జిల్లా నుండి, అదేవిధంగా భద్రాచలం నియోజకవర్గ పరిధిలోకి వచ్చే వెంకటాపురం, వాజేడు మండలాలు, ఇల్లందు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే గార్ల, బయ్యారం, కామేపల్లి మండలాలలోని పోలింగ్ కేంద్రాలకు ములుగు, ఖమ్మం జిల్లాల నుండి సిబ్బందిని కేటాయింపు చేయనున్నట్లు చెప్పారు. మన జిల్లా పరిధిలో ఉన్న 962 పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది కేటాయింపుకు అన్ని శాఖల నుండి సేకరించిన సిబ్బంది జాబితా మేరకు కేటాయింపు చేస్తున్నామని చెప్పారు. అదనంగా 30 శాతం రిజర్వు సిబ్బందితో 5783 మంది జాభితాను మొదటి దశ ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు చెప్పారు. నియోజకవర్గాలకు పోలింగ్ సిబ్బందిని కేటాయించడం జరిగింది. మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ తదుపరి మాస్టర్ ట్రైనర్స్ చే పిఓ, ఏపిఓ, ఓపిఓలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెన్ పవర్ మేనేజ్ మెంట్ అధికారి, డీఈఓ వెంకటేశ్వరచారి, జాతీయ సమాచార విజ్ఞాన కేంద్రం అధికారి సుశీల్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు ప్రసాద్, రంగ ప్రసాద్ పాల్గొన్నారు.