నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పలు కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదం నుంచి 40 మందికి పైగా స్కూల్ విద్యార్థులు త్రుటిలో తప్పించుకున్నట్లు తాజాగా తెలిసింది. ఈ విషయాన్ని పోలీసు అధికారులు వెల్లడించారు.
టి.దర్శహళ్లి నుంచి దండేలికి వెళ్తున్న ఓ టూర్ బస్సు.. ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సమాంతరంగా ప్రయాణించింది. ఈ టూర్ బస్సులో 42 మంది విద్యార్థులు ఉన్నారు. ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొనడంతో ఆ ప్రమాద ధాటికి స్కూల్ బస్సు కూడా అదుపు తప్పింది. ఈక్రమంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైన ప్రైవేట్ బస్సును వెనక నుంచి ఢీకొట్టి రోడ్డు పక్కకు జారింది. అయితే, పిల్లల బస్సుకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఐజీపీ రవికాంతేగౌడ వెల్లడించారు. విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు డ్రైవర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసినట్లు తెలిపారు.



