నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వన్డే క్రికెట్ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్ల హవా పెరిగిపోతుండటంతో 50 ఓవర్ల ఫార్మాట్ క్రమంగా ప్రాభవం కోల్పోతోందని, 2027 ప్రపంచకప్ తర్వాత వన్డే క్రికెట్ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన అశ్విన్, “2027 ప్రపంచకప్ తర్వాత వన్డే ఫార్మాట్ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని నేను కొంచెం ఆందోళన చెందుతున్నాను. అది నెమ్మదిగా అంతరించిపోయే దిశగా వెళుతోంది” అని అన్నాడు. ఆధునిక క్రికెట్ దిగ్గజాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి వాళ్లు రిటైర్ అయ్యాక ఈ ఫార్మాట్కు ఆదరణ మరింత పడిపోతుందని అభిప్రాయపడ్డాడు.
“విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్, కోహ్లీ ఆడటంతో ప్రజలు దాన్ని చూడటం మొదలుపెట్టారు. క్రీడ ఎప్పుడూ వ్యక్తుల కంటే గొప్పదే. కానీ, కొన్నిసార్లు ఫార్మాట్ను బతికించడానికి ఇలాంటి స్టార్ ఆటగాళ్లు అవసరం. ఒకవేళ వాళ్లు వన్డేలు ఆడటం మానేస్తే పరిస్థితి ఏంటి?” అని అశ్విన్ ప్రశ్నించాడు. కేవలం ఆదాయం కోసం ఐసీసీ తరచూ ప్రపంచకప్లు నిర్వహించడం వల్ల టోర్నమెంట్ విలువ తగ్గిపోతోందని విమర్శించారు.



