Thursday, May 22, 2025
Homeజాతీయంఅశోక వర్సిటీ ప్రొఫెసర్‌ అలీఖాన్‌కు ఊరట

అశోక వర్సిటీ ప్రొఫెసర్‌ అలీఖాన్‌కు ఊరట

- Advertisement -

– బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

అశోక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ అలీఖాన్‌ మహ్ముదాబాద్‌కు స్వల్ప ఊరట లభించింది. ఆపరేషన్‌ సిందూర్‌పై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారన్న కారణంతో అరెస్టైన ఆయనకు సుప్రీంకోర్టు తాజాగా మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, ఈ కేసు దర్యాప్తును నిలిపివేయడా నికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఆపరేషన్‌ సిందూర్‌పై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారన్న కారణంతో హరియాణాలోని అశోక యూనివర్శిటీ ప్రొఫెసర్‌ అలీఖాన్‌ మహ్ముదా బాద్‌ను పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజనీతి శాస్త్రం విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అయితే, అలీ ఖాన్‌ సామాజిక మాధ్యమాల్లో ఇచ్చిన పోస్ట్‌లతో ఆయనపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్‌ కూడా ఆ ప్రొఫెసర్‌కు నోటీసులు ఇచ్చింది. రెండు రోజుల క్రితం అలీ ఖాన్‌ను పోలీసులు ఢిల్లీలో అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తన అరెస్టును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను బుధవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎన్‌ కోటీశ్వర్‌ సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. పిటిషనర్‌ తరపున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపిస్తూ సదరు సోషల్‌ మీడియా పోస్ట్‌ వెనుక ఎటువంటి నేరపూరిత ఉద్దేశం లేదని వాదించారు. దీంతో ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. అలాగే ఆయన పోస్టులలో ఉపయోగించిన పదాలను దర్యాప్తు చేయడానికి హర్యానాకు చెందని, ఒక మహిళా అధికారితో సహా ముగ్గురు ఐపీఎస్‌ అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేయాలని హర్యానా డీజీపీని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. గురువారం (మే 22) నాటికి సిట్‌ను ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ విషయంలో కొత్త ఎఫ్‌ఐఆర్‌లను స్వీకరించవద్దని కూడా పోలీసులకు స్పష్టం చేసింది. మహ్ముదాబాద్‌ తన పాస్‌పోర్ట్‌ను సోనెపట్‌లోని చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌కు అప్పగించాలని, రెండు ఎఫ్‌ఐఆర్‌లలో సాధారణ బెయిల్‌ బాండ్‌లను సమర్పించాలని సూచించింది. అయితే మధ్యంతర ఉపశమనం ఎత్తివేయాలని కోరుతూ హర్యానా పోలీసులు తమ దర్యాప్తులో మరిన్ని ఆధారాలను చేర్చడానికి అనుమతించాలని కోరారు. అయితే మహ్ముదాబాద్‌ దర్యాప్తునకు సహకరించాలని, ఆయన సహకారాన్ని సులభతరం చేయడానికి మధ్యంతర బెయిల్‌ ఇవ్వబడిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు మహ్ముదాబాద్‌ అరెస్టును విద్యావేత్తలు, పౌర సమాజం ఖండించింది. దీనిని స్వేచ్ఛా వాక్‌ స్వాతంత్య్రం, విద్యా స్వేచ్ఛపై దాడి అంటూ వ్యాఖ్యానించారు.
అశోక వర్శిటీ ప్రొఫెసర్‌ అరెస్టుపై నివేదిక కోరిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ
హర్యానాలోని అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అలీఖాన్‌ మహముదాబాద్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపడాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సుమోటోగా స్వీకరించిం ది. అలీఖాన్‌ అరెస్టుపై పూర్తి వివరాలతో వారం రోజుల్లోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని హర్యానా డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ను బుధవారం ఆదేశించి ంది. ప్రొఫెసర్‌ను అరెస్టు చేయడంలో మానవ హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ ఉల్లంఘనకు గురైనట్లు మీడియాలో వస్తున్న వార్తలను ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఈ సందర్భంలో ఉదహరించింది. కాబట్టే, ఈ కేసును సుమోటోగా స్వీకరించడానికి సరైనదిగా భావిస్తున్న ట్టు కమిషన్‌ పేర్కొంది. దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలిగించడం, వివిధ ప్రజల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం వంటి ఆరోపణలతో ప్రొఫెసర్‌ అలీఖాన్‌ను గతవారంలో హర్యానా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అరెస్టును విద్యావేత్తలు, పౌర సమాజం తీవ్రగా విమర్శిస్తున్నారు. ఈ అరెస్టును వాక్‌ స్వేచ్ఛ, విద్యా స్వేచ్ఛపై దాడిగా ఖండిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -