– నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్పై ఈడీ ఆరోపణలు
– ఢిల్లీ ప్రత్యేక కోర్టులో వాదనలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపణలు చేసింది. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల ద్వారా వారు రూ.142 కోట్లు లబ్ది పొందారని ఆరోపించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీ ప్రత్యేక కోర్టులో ఈడీ తన వాదనలు వినిపించింది. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. నవంబర్ 2023లో నేషనల్ హెరాల్డ్తో ముడిపడి ఉన్న రూ.751.9 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసే వరకూ ఆ నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సోనియా, రాహుల్ అనుభవించారని కోర్టుకు తెలిపారు. నేషనల్ హెరాల్డ్ పేపర్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీని ఈడీ గతంలో విచారించింది. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపారన్న ఫిర్యాదు మేరకు ఈడీ, సీబీఐ దర్యాప్తు చేపట్టాయి. అయితే, సీబీఐ విచారణ అర్ధాంతరంగానే నిలిచిపోగా.. ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతూ వస్తుంది. ఇటీవల ఈ కేసులో 2023 నవంబర్లో జప్తు చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఎజెఎల్)కి చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు ప్రారంభించి.. నోటీసులు జారీ చేసింది. ఈడీ ఇప్పటి వరకు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్, యంగ్ ఇండియాకు చెందిన దాదాపు రూ.751.9కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఆయా ఆస్తుల్లో అద్దెకు ఉంటున్న వారు తమకే ఆ మొత్తాన్ని చెల్లించాలని సూచించింది. అక్రమ చలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ (8) నిబంధన 5(1) ప్రకారం జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేపట్టినట్టు తెలిపింది.అయితే ఈడీ చార్జిషీట్పై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మరికొందరు నేతలపై చార్జిషీట్ దాఖలు చేయడమనేది ప్రధానమంత్రి, హౌంమంత్రి ప్రతీకార రాజకీయాలకు పాల్పడడం, బెదిరింపులకు ప్రయత్నించడమే తప్ప మరొకటి కాదని అన్నారు. భారత జాతీయ కాంగ్రెస్.. దాని నాయకత్వం మౌనంగా ఉండదు.. సత్యమేవ జయతే! అంటూ ట్వీట్ చేశారు.
రూ.142 కోట్లు లబ్ది
- Advertisement -
- Advertisement -