నవతెలంగాణ-హైదరాబాద్: కోలీవుడ్ నటుడు విజయ్ నటించిన ‘జన నాయగణ్’ సినిమాకు సెన్సార్బోర్డు నుంచి ధృవీకరణ పత్రం రాకపోవటంతో విడుదల వాయిదా పడింది. శుక్రవారమే రాజాసాబ్తోపాటుగా ఈ సినిమా కూడా విడుదల కావాల్సివుంది. ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యులు కమల్హాసన్ ఒక ట్వీట్ చేశారు. కళకు, కళాకారులకు, రాజ్యాంగానికి మద్దతుగా అంటూ అధికారిక ప్రకటనను కమల్హాసన్ విడుదల చేశారు.
‘భారతదేశ రాజ్యాంగం మనందరికీ భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించింది. కానీ, దానిని నేడు కొందరు అంధకారంలోకి నెట్టివేస్తున్నారు. ఇది ఒక్క సినిమాకు సంబంధించిన విషయం కాదు. కళాకారులకు మన రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ఇచ్చే స్థానం గురించి కూడా ప్రతిబింబిస్తుంది. సినిమా అనేది కేవలం ఒక వ్యక్తి కృషి మాత్రమే కాదు. ఇందులో రచయితలు, సాంకేతిక నిపుణులు, నటులు, చిన్న వ్యాపారులు కూడా భాగస్వామ్యంగా కలిసి నిర్మించే సమిష్టి శ్రమ. వీరి జీవనాధారం ఇందులో భాగమై ఉంటుంది.
సమాజంలో ఇలాంటి అంశాల్లో స్పష్టత లేకపోతే సృజనాత్మకత కుంటుపడుతుంది. ఆపై ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోతాయి. సినిమా సర్టిఫికేషన్ ప్రక్రియను మరోసారి పునఃపరిశీలించాలి. ఒక సినిమాకు ఇవ్వాల్సిన అనుమతులకు నిర్దిష్ట సమయ పరిమితులు ఉండాలి. అందులో పారదర్శకంగా అధికారులు పనిచేయాలి. సినిమా నుంచి ఏదైనా సీన్కు అభ్యంతరం ఉంటే అందుకు సంబంధించిన మార్పులను రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలి. సినిమా పరిశ్రమ మొత్తం ముందుకు రావాల్సిన సమయం వచ్చింది’ అంటూ విజయ్ కు మద్ధతుగా కమల్ ట్వీట్ చేశారు.



