సమస్యల సుడిగుండంలో కార్మికులు పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నోయిడా అల్లర్లు ఒక హెచ్చరిక
వేతన స్తబ్ధత, ఒప్పంద కార్మిక వ్యవస్థ దుర్వినియోగం
దేశవ్యాప్తంగా శ్రామికుల్లో పెరుగుతున్న అసంతృప్తి
మేధావులు, కార్మిక సంఘాల నాయకుల ఆందోళన
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ పాలనలో కార్మికులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ల పేరుతో అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలు అక్కడి కార్మికులకు డబుల్ కష్టాలను తీసుకొస్తున్నాయి. యూపీలోని నోయిడాలో గతనెలలో జరిగిన కార్మికుల తీవ్ర నిరసనలే దీనికి నిదర్శనమని మేధావులు, కార్మిక సంఘాల నాయకులు, విశ్లేషకులు చెప్తున్నారు. ఇది భారత్లో ప్రస్తుత కార్మిక వ్యవస్థ.. కార్మికులకు అనుకూలంగా పని చేయడం లేదని స్పష్టంగా చూపిస్తున్నదని వివరిస్తున్నారు. వేతనాలు పెరగకపోవడం, ద్రవ్యోల్బణం, ఒప్పంద కార్మిక వ్యవస్థలో దోపిడీ వంటి కారణాలతో కార్మికులు వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కార్మికుల్లో అసంతృప్తి తీవ్రమవుతోందని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో నోయిడాలో జరిగిన కార్మికుల నిరసనలు ఒక్క ప్రాంతానికి మాత్రమే పరిమితమని భావించొద్దనీ, దేశంలోని వివిధ పారిశ్రామిక కేంద్రాల్లో కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు సమన్వయంతో జరగకపోయినా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం ఒకే విధంగా ఉన్నాయనే విషయం అర్థం చేసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. తక్కువ వేతనాలు, పెరుగుతున్న ఖర్చులు, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటివి వీరు కదలిస్తే కన్నీళ్లే ఎదుర్కొంటున్న సమస్యల జాబితాలో ఉన్నాయి.
కార్మికుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టని యూపీ సర్కారు
ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు విమర్శలకు గురవుతున్నాయి. నోయిడాలో ‘ఇండిస్టియల్ పీస్’ కోసం ప్రత్యేక పోలీస్ సెల్ ఏర్పాటు చేయడం ద్వారా సమస్యను ప్రభుత్వం శాంతి భద్రతల సమస్యగా చూస్తోంది. అయితే కార్మికుల అసలు సమస్యలు మాత్రం.. వేతనాలు, హక్కులు, భద్రత. వీటిని పరిష్కరించడంలో మాత్రం యూపీ సర్కారు ఆసక్తి చూపడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యోగి సర్కారు ఎదురుదాడి
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కార్మికుల నిరసనలపై యోగి సర్కారు ఎదురుదాడికి దిగడం. నోయిడా అల్లర్లకు బాహ్యశక్తులు కారణమనీ, ఇందులో పాకిస్తాన్ హస్తం, అర్బన్ నక్సల్స్ హస్తం ఉందని బీజేపీ సర్కారు ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. కార్మికులు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ.. సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్మికులు జరిపిన ఈ నిరసనల్లో కేవలం ఫ్యాక్టరీ కార్మికులే కాకుండా గృహ కార్మికులు, విశ్వవిద్యాలయ సిబ్బంది కూడా చేరడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోందని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు. అంటే ఇది ఒక విస్తృత కార్మిక సంక్షోభంగా మారుతోందని మేధావులు చెప్తున్నారు. చరిత్రలో కూడా ఒప్పంద కార్మిక వ్యవస్థను ప్రోత్సహించరాదని కోర్టులు, కమిషన్లు సూచించాయి. కానీ ప్రస్తుతం విధానాలు మారడంతో, ఈ వ్యవస్థ విస్తరిస్తోంది. ఇది భవిష్యత్తులో కార్మికుల పరిస్థితిని మరింత దారుణంగా మార్చే ప్రమాదం ఉందని మేధావులు,
విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
అలా చేయకపోతే.. అశాంతి పెరిగే ప్రమాదం నోయిడా అల్లర్లు కేవలం ఒక ఘటనగా చూడొద్దనీ, దీనిని భారత్లో కార్మికుల సమస్యలు తీవ్రస్థాయికి చేరుకున్నాయని తెలియజేసే హెచ్చరికగా భావించాలని మేధావులు అంటున్నారు. ప్రభుత్వం సమస్యను లోతుగా అర్థం చేసుకొని, కార్మిక హక్కులను రక్షించే విధానాలను తీసుకురాకపోతే.. ఇలాంటి అశాంతి మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
యూనియన్లు నిర్వీర్యం
గతంలో కార్మిక సమస్యలను పరిష్కరించడానికి చర్చలు, ఒప్పందాలు, మధ్యవర్తిత్వ వ్యవస్థలు ఉండేవి. ట్రేడ్ యూనియన్లు కార్మికులకు నాయకత్వం వహించి సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించేవి. ప్రస్తుతం ఆ వ్యవస్థలను ప్రభుత్వాలు బలహీనపడేలా చేశాయి. దీంతో కార్మికులు తమ గోడును చెప్పుకునే వేదికలు లేకుండా పోయాయి. దీంతో వారు నిరసనలకు దిగడం తప్పితే మరో మార్గం లేకుండా పోతోంది.
0



