నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25శాతం టారిఫ్లను విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ”ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్తో వ్యాపారం చేసే ఏ దేశమైనా అమెరికాతో చేసే వ్యాపారంపై 25శాతం సుంకం చెల్లించాల్సి వుంటుంది. ఈ ఉత్తర్వు తుది మరియు నిశ్చయాత్మకమైనది” అని ట్రంప్ సోమవారం తన సోషల్మీడియా ట్రూత్లో పేర్కొన్నారు. ఇరాన్ ప్రధాన వాణిజ్య భాగస్వామ్యులలో చైనా, టర్కీ, భారత్, యుఎఇ, పాకిస్తాన్ మరియు అర్మేనియాలు ఉన్నాయి. ఈ ప్రకటన భారత్తో పాటు ఐదు ప్రధాన వాణిజ్య భాగస్వామ్యదేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికా ఇప్పటికే భారత్పై 50శాతం సుంకాలను విధించింది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. వాటిలో రష్యా నుండి చమురు కొనుగోళ్లపై విధించిన 25శాతం కూడా ఉంది.
భారత్ నుండి ప్రధాన ఎగుమతుల్లో బియ్యం, టీ, చక్కెర, ఔషధాలు, మానవనిర్మిత పైబర్లు, విద్యుత్ యంత్రాలు కృత్రిమ ఆభరణాలు ఉన్నట్లు టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. ఇరాన్ నుండి భారత్ ప్రధానంగా డ్రైఫ్రూట్స్, అకర్బన/సేంద్రీయ రసాయనాలు, గాజు సామాను ఉన్నాయి. ఆన్లైన్ డేటా విజువలైజేషన్ మరియు పంపిణీకి చెందిన అబ్జర్వేటరీ ఆఫ్ ఎకనామిక్ కాంప్లెక్సిటీ (ఒఇసి) ప్రకారం.. 2023లో భారత్ నుండి ఇరాన్కు ఎగుమతులు మొత్తం 1.19 బిలియన్ డాలర్లు కాగా, భారత్లోకి దిగుమతుల మొత్తం 1.02 బిలియన్ డాలర్లు. 2023లో, భారత్ నుండి ఇరాన్కు అత్యధికంగా ఎగుమతులు బియ్యం (734మిలియన్ డాలర్లు), సోయాబీన్ మీల్ (96.8మిలియన్ డాలర్లు), అరటిపండ్లు (52మిలియన్ డాలర్లు).



