పాలకులకు పనిచేస్తున్న విలేకరులు..
కొందరి ప్రవర్తనతో మీడియా పరువు పోతోంది..
నవతెలంగాణ-అచ్చంపేట
ఒక్క సిరా చుక్క లక్ష మెదడులను కదిలింప చేస్తుంది. ఆలోచింప చేస్తుందని ఓ కవి వర్ణించాడు. ఎక్కడో చదివిన జ్ఞాపకం జర్నలిజం అంటే.? ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉంటూ ప్రజా సమస్యల గుర్తించి వార్త కథనాల రూపంలో ప్రచురించి పరిష్కారానికి కృషి చేయాలి. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అధికారుల తప్పిదాలను అక్రమాలను నిష్పక్షపాతంగా ప్రజలకు తెలియజేయడమే నిజమైన జర్నలిజం. ప్రజాస్వామానికి నాలుగో పిల్లర్ మీడియా.
మీడియా అవినీతి అక్రమాలకు పాల్పడితే ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. దీని ద్వారా అనగారిన పేదవర్గాల ప్రజలు సంక్షేమ పథకాల కు దూరమై దుర్భరమైన జీవితాలు గడుపుతారు. అంతటి ప్రాధాన్యత గల మీడియా వ్యవస్థలోకి కొన్ని చీడ పురుగులు వచ్చి వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నారు. జర్నలిజంలో ఓనమాలు తెలియని వ్యక్తులు సైతం విలేకరులమంటూ చలామణి అవుతున్నారు. కొందరు హుందాతనం కోసం మరి కొందరు అక్రమ వ్యాపారాలను కాపాడుకునేందుకు మీడియా రంగాన్ని ఎంచుకొని మీడియా రంగాన్ని తప్పుతోవ పట్టిస్తున్నారు. పెరిగిన సాంకేతిక రంగం, సోషల్ మీడియా ఆన్లైన్ వ్యవస్థ ఇందుకు దోహదపడుతున్నాయి. దీని ఆసరాగా చేసుకున్న కొందరు మీడియా రంగంలోకి ప్రవేశించి.. రెగ్యులర్ గా వార్తలు రాస్తున్న పాత్రికేయుల పరువు తీస్తున్నారు. రాజకీయ నాయకుల అక్రమాలపై విలేకరులు వార్తలు రాస్తే.. బెదిరిస్తున్నారు. అక్రమ కేసులు పెట్టిన సంఘటనలు ఎన్ని ఉన్నాయి. పెరిగిన సాంకేతిక రంగం, సోషల్ మీడియా కారణంగా సమాజంలో జర్నలిస్టులు భద్రతకు రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వ కార్యాలయాలలో తప్పుడు బిల్లులు సృష్టించి ప్రజాధనాన్ని దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.
వార్తలు రాస్తే.. దాడులు చేసి బయోందోళనలకు గురి చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. జర్నలిజం ముసుగులో అక్రమ వ్యాపారాలకు కొందరు జర్నలిజాన్ని వారి అక్రమ వ్యాపారాల కోసం తాకట్టు పెడుతున్నారు. నిబద్ధత కలిగిన అధికారులు వాస్తవంగా వార్తల రాస్తున్న విలేకరులను గుర్తిస్తే.. ఆయా మండలాలలో రాయలేని విలేకరుల ఆగడాలకు అడ్డుకట్ట వేయొచ్చు.
కొందరు విలేకరులు చెంచాగిరి చేయటానికే పత్రికల్లో కొనసాగుతున్నారు. అధికార పార్టీకి బానిసలుగా పనిముట్లుగా కొందరు జర్నలిస్టులు పనిచేస్తున్నారు. అక్కడక్కడ స్థానికంగా ప్రెస్ క్లబ్ లలో ప్రాధాన్యత, గౌరవం దక్కకపోతే.. గ్రూపులను ఏర్పాటు చేసి లీడర్ గా చలామణి అవుతూన్నారు. పాలకులకు అధికారులకు వ్యతిరేకంగా రాస్తున్న జర్నలిస్టులను టార్గెట్ చేసి మానసికంగా దెబ్బకొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారులకు, ఎమ్మెల్యేలకు లేనిపోని అబద్దాల మాటలు చెప్పి కొందరు కాలం గడుపుతున్నారు.
నిజాలను రాస్తున్న విలేకరులపై కొందరు నకిలీ విలేకరులు పెత్తనం చెలాయిస్తున్నారు. అధికార పార్టీపై వ్యతిరేక వార్త రాస్తున్న విలేకరులపై అతను పని చేస్తున్న సంస్థ యాజమాన్యానికి లేనిపోని అబద్ధాలు చెప్పుతూ విలేకరి పదవి నుంచి తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారు. పత్రికా యాజమాన్యానికి ఎలా ఫిర్యాదు చేయాలో విలేకరి పదవిని ఎలా పీకించాలో నాయకులకు కొందరు విలేకరులే నేర్పుతున్నారు. ఈ విధానం మీడియా వ్యవస్థకు చాలా ప్రమాదం. ఇప్పటికైనా సమాజం కోసం పాటుపడుతున్న, ప్రజాధనానికి రక్షణగా ఉంటున్న జర్నలిస్టులలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మార్పు వస్తుందని, సమాజం కోసం పాటు పడతారని పేద ప్రజలు ఆశిస్తున్నారు.



