డిప్యూటీ సీఎం వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి
మృతి చెందిన గొర్రెలకు నష్టపరిహారం చెల్లించాలి
షరతులు లేకుండా రైతుల పంటను పూర్తిగా కొనుగోలు చేయాలి
పాతర్లపాడు లోనే నష్టం సుమారు రూ.2 కోట్లు
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు
నవతెలంగాణ – బోనకల్
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అగ్నికి రైతుల పంట ఆహుతి అయిందని, ఎటువంటి షరతులు లేకుండా రైతుల పంటను పూర్తిస్థాయిలో మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, మృతి చెందిన గొర్రెలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, జిల్లా సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చింతకాని మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామంలో ఆదివారం రాత్రి అగ్నికి ఆహుతైన మొక్కజొన్న పంటను, మొక్కజొన్న బస్తాలను, గొర్రెల ను సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, సీపీఐ(ఎం) జిల్లా సీనియర్ నాయకులు వత్సవాయి జానకి రాములు, సీపీఐ(ఎం) బోనకల్ మండల కార్యదర్శి కిలారు సురేష్ పాతర్లపాడు సర్పంచ్ ఓబినబోయిన లక్ష్మి సోమవారం పరిశీలించారు.

అగ్నికి ఆహుతైన ఐదు ఎకరాల కుప్పబోసిన మొక్కజొన్న కంకులను, పొలంలోనే కాలిపోయిన ఎకరంన్నర పంటను వారు పరిశీలించారు. అదేవిధంగా అగ్నికి ఆహుతైన 25 గొర్రెలను, మేకలను పరిశీలించారు. అనంతరం మృతి చెందిన గొర్రెల కాపరి వోబినబోయిన వీరబాబును పరామర్శించారు. వీరబాబు కి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రైతులు తాము నెల రోజుల నుంచి పడుతున్న కష్టాలను, ఇబ్బందులను వారికి వివరించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రం అధికారుల తమ పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని రైతులు సీపీఐ(ఎం) నాయకులకు వివరించారు. కాలిపోతున్న మొక్కజొన్న పంటను, కాలిపోయి కండ్లు కోల్పోయిన గొర్రెలను మేకలను, వీరబాబు రోదనను చూసి నున్న నాగేశ్వరరావు, పొన్నం వెంకటేశ్వరరావు, మడిపల్లి గోపాల్ రావు చలించి పోయారు.
ఈ సందర్భంగా నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ..డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రైతుల కష్టాలు పడుతుంటే ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. నాగలవంచ సొసైటీ పరిధిలో పాతర్లపాడుతో పాటు మరికొన్ని గ్రామాల రైతుల మొక్కజొన్నలను కాంటా వేసి గోడౌన్లకు తరలించకుండా పొలాలలో, కల్లాలలో ఉంచటం వల్లే ఆదివారం వచ్చిన మంటల్లో సుమారు 42 మంది రైతులకు చెందిన 120 ఎకరాల పంట కాలిపోయిందన్నారు. సుమారు రూ.2 కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నారు. ఇందులో కొందరు పంట పూర్తిగా కాలిపోగా మరికొందరి పంట పాక్షికంగా కాలిపోయిందన్నారు. రైతుల పంటను ఒకవైపు కొనుగోలు చేస్తామని చెబుతూ మరొకవైపు పంటను కొనుగోలు చేయకుండా రోజుల తరబడి పొలాలలో, కల్లాలలో ఉంచటం వల్ల రైతులకు ఈ నష్టం జరిగిందన్నారు.
ఎటువంటి షరతులు, నిబంధనలు లేకుండా రైతు వద్ద ఉన్న మొక్కజొన్న పంటను మద్దతు ధరకు పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బాధితు రైతులను సమీకరించి పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కమిషన్ల పనులు అయిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు వస్తారని, సుమారు రెండు కోట్ల రూపాయల పంట నష్టం జరిగిన రైతులను పరామర్శించకపోవడం దారుణం అన్నారు. కమిషన్ల కోసమే భట్టి విక్రమార్క పనిచేస్తున్నారు తప్ప రైతుల సమస్యల పట్టించుకోరని వారు ఘాటుగా విమర్శించారు. నేటికీ పొలాలలో, కల్లాలలో వేలాది క్వింటాల మొక్కజొన్నలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్నలను రైతుల నుంచి కొనుగోలు చేయలేమని, చేతకాదని ప్రభుత్వం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.

రైతుల కష్టాలను చూస్తుంటే కన్నీరు వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితి చూస్తుంటే డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో రైతులకు ఇటువంటి పరిస్థితి ఏర్పడటం బాధాకరమన్నారు. ఆదివారం ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మొక్కజొన్న చెత్తకు నిప్పి పెట్టారని, ఆ నిప్పు దహనంలా వ్యాపించి రైతుల పంటను అగ్నికి ఆహుతి చేసింది అన్నారు. ఇదే సమయంలో పాతర్లపాడు గ్రామానికి చెందిన ఓబినబోయిన వీరబాబు తనకు చెందిన 200 గొర్రెలను పొలాల నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఒక్కసారిగా వచ్చిన మంటలు, ఈదురు గాలులతో 200 గొర్రెలు ఆ మంటలో చిక్కుకుపోయాయి అన్నారు. భారీ ఎత్తున పొగ కమ్ముకోవటంతో పాటు గొర్రెల చుట్టూ మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో గొర్రెలు ఎటు వెళ్లలేక మంటలలోనే చిక్కుకుపోయాయి అన్నారు.
మంటలలోనే 25 గొర్రెలు మృత్యువాత పడ్డాయన్నారు. ఆదివారం రాత్రి మరో 10 గొర్రెలను మృతి చెందాయన్నారు. సుమారు 30 గొర్రెలు ఆ మంటలలో కాళీ కనిపించకుండా ఎటుపోయాయో తెలియటం లేదన్నారు. మరో సుమారు 50 గొర్రెల వరకు పాక్షికంగా కాలిన గాయాలతో ఉన్నాయన్నారు. సుమారు పది గొర్రెల వరకు మంటల వల్ల కళ్ళు కోల్పోయాయి అన్నారు. వీరబాబు కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) బోనకల్ మండల కార్యదర్శి కిలారు సురేష్, పాతర్లపాడు సర్పంచ్ ఓబినబోయిన లక్ష్మి, సీపీఐ(ఎం) నాయకులు ఓబినబోయిన అచ్చయ్య, వత్సవాయి జానకి రాములు, కొండ్రు జానకి రాములు, తోటకూర వెంకట నరసయ్య, ఆలస్యం రవి, దేశబోయిన ఉపేందర్, గడ్డం కోటేశ్వరరావు, పాతర్లపాడు గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో బాధిత రైతులు పాల్గొన్నారు.



