నవతెలంగాణ – హైదరాబాద్: 2026 టీ20 ప్రపంచ కప్ను తాము బహిష్కరించడం లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) స్పష్టం చేసింది. భద్రతా కారణాలతో బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుంచి వైదొలిగితే, ఆ జట్టుకు సంఘీభావంగా తాము కూడా ప్రపంచ కప్ను బాయ్కాట్ చేస్తామంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. తమ మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే జరగనున్నాయని, కాబట్టి ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చిచెప్పింది.
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నమెంట్లో భాగంగా, తమ గ్రూప్ మ్యాచ్లను కోల్కతా, ముంబయిలో ఆడేందుకు బంగ్లాదేశ్ భద్రతా కారణాల దృష్ట్యా విముఖత చూపుతోంది. ఈ నేపథ్యంలో, బంగ్లాదేశ్కు మద్దతుగా పాకిస్థాన్ కూడా టోర్నీ నుంచి వైదొలగుతుందని కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి. ఈ ఊహాగానాలపై పీసీబీ వర్గాలు గట్టిగా స్పందించాయి.
“2025 ఆరంభంలో కుదిరిన ఒప్పందం ప్రకారమే మా మ్యాచ్లన్నీ శ్రీలంకకు షెడ్యూల్ అయ్యాయి. అలాంటప్పుడు మేం టోర్నమెంట్ నుంచి ఎందుకు వైదొలగుతాం? కొందరు కావాలనే ఈ వివాదాన్ని పెద్దది చేసేందుకు ప్రయత్నిస్తున్నారు” అని ఓ క్రీడా వెబ్సైట్కు వెల్లడించాయి. మరోవైపు, భారత్లో ఆడేందుకు బంగ్లాదేశ్పై ఐసీసీ ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఒకవేళ బంగ్లాదేశ్ అంగీకరించకపోతే, ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను టోర్నీలోకి తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఐసీసీ నుంచి తమకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని, ఒత్తిడి చేసి తమతో ఆడించలేరని బంగ్లాదేశ్ ప్రభుత్వ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ స్పష్టం చేశారు. ఈ విషయంపై ఐసీసీ తమను సంప్రదించలేదని స్కాట్లాండ్ కూడా తెలిపింది.



