నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రస్తుత ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆర్సీబీ యాజమాన్యం కోసం బలమైన, పోటీతో కూడిన బిడ్ వేయనున్నట్లు ఆయన గురువారం తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో వెల్లడించారు. కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళికి పెను ముప్పుగా మారిన తరుణంలో… ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్ తయారీతో అదర్ పూనావాలా ‘వ్యాక్సిన్ ప్రిన్స్’ గా పేరుపొందడం తెలిసిందే. అలాంటి బయో సైన్సెస్-వ్యాపార దిగ్గజం కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీ రేసులోకి దిగడం మరింత ఆసక్తి కలిగిస్తోంది.
గతేడాది నవంబర్లోనే ఆర్సీబీ మాతృసంస్థ అయిన యునైటెడ్ స్పిరిట్స్కు చెందిన డయాజియో, జట్టును అమ్మకానికి పెట్టింది. ఇది తమ ప్రధాన ఆల్కహాల్ వ్యాపారంలో భాగం కానందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. అయితే, 2025 జూన్లో ఐపీఎల్ గెలిచిన తర్వాత చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన విజయోత్సవాల్లో తొక్కిసలాట జరిగి 11 మంది అభిమానులు మరణించడంతో అమ్మకం ప్రక్రియ మరింత వేగవంతమైంది. పూనావాలాతో పాటు, ప్రముఖ కన్నడ సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ కూడా ఆర్సీబీని కొనుగోలు చేసేందుకు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, 2026 సీజన్ కోసం తమ హోం మ్యాచ్లను బెంగళూరు నుంచి మార్చాలని ఆర్సీబీ యాజమాన్యం యోచిస్తోంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం, రాయ్పూర్లోని వీర్ నారాయణ్ సింగ్ స్టేడియాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే చిన్నస్వామి స్టేడియంనే హోం గ్రౌండ్గా కొనసాగించాలని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కోరుతోంది.



