నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తర భారత్లో హిమపాతం నానా బీభత్సం సృష్టిస్తోంది. జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో భారీగా మంచు కురుస్తోంది . నిరంతరం కురుస్తున్న మంచు కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాలు పూర్తిగా మంచుతో కప్పుకుపోయాయి.
మంచు కారణంగా ఎక్కడికక్కడ రహదారులు మూసుకుపోయాయి. రహదారులపై మంచు పేరుకుపోవడంతో 1,250 రోడ్లను అధికారులు మూసివేశారు (Roads Closed ). దీంతో వరుస సెలవులతో కొండ ప్రాంతానికి వెళ్లిన పర్యాటకులు ఎక్కడివారు అక్కడే వాహనాల్లోనే చిక్కుకుపోయారు. నేడు కూడా పర్వత ప్రాంతాల్లో భారీగా హిమపాతం సంభవించే అవకాశం ఉందని స్థానిక వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో కులు, కిన్నౌర్, చంబా, లాహౌల్-స్పితి ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
మరోవైపు తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకూ అనవసర ప్రయాణాలు చేపట్టొద్దని ప్రజలకు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. అంతేకాదు వరుస సెలవులతో మంచు అందాలను ఆస్వాదించేందుకు మనాలీ వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన పర్యాటకులు వారు బసచేసే ప్రదేశాల్లోనే ఉండాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణాలు చేపొట్టొద్దని హెచ్చరించారు.



