నవతెలంగాణ-హైదరాబాద్: భారత సరిహద్దుల్లోకి చైనా సైన్యం చొరబడుతోందనే మాటలు తాను చెప్పినవి కావని, స్వయంగా ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే తన పుస్తకంలో రాసినవేనని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలిపారు. లోక్సభ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మాజీ ఆర్మీ చీఫ్ పుస్తకం బయటకు వస్తే మన సైన్యాన్ని ప్రభుత్వ నేతలు ఎలా నిరాశపరుస్తున్నరనేది ప్రజలు తెలుసుకుంటారని చెప్పారు.
మాజీ ఆర్మీ చీప్ తన దృష్టికోణాన్ని ఎందుకు చెప్పుకూడదు? ఆయన ఏమి చెప్పి ఉంటారని ప్రభుత్వం భయపడుతోంది? అని రాహుల్ ప్రశ్నించారు. ‘ప్రధాన మంత్రి గురించి, రాజ్నాథ్ సింగ్ గురించి పుస్తకంలో స్పష్టంగా రాశారని నేను చెప్పదలచుకున్నాను. ఒక ఆర్టికల్లో కూడా ఈ విషయం వచ్చింది. నేను ఆ ఆర్టికల్ను ప్రస్తావించాను. దాంతో నన్ను మాట్లాడకుండా అడ్డుకున్నారు. అసలు విషయాలు బయటకు వస్తాయనే భయమే అందుకు కారణం. మాజీ ఆర్మీ చీఫ్ తన పుస్తకంలో ఏమి రాశారో, ఆయనకు రాజ్నాథ్ సింగ్, ప్రధాని మోదీ ఏ ఆదేశాలు ఇచ్చారో, వారి మధ్య జరిగిన సంభాషణలు ఏమిటో సభలో చెప్పాలనుకున్నాను. కానీ రెండు,మూడు లైన్లు మాట్లాడగానే నన్ను ప్రసంగించకుండా అడ్డుకున్నారు’ అని రాహుల్ తెలిపారు.



