- ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ
నవతెలంగాణ-కామారెడ్డి: మండల కేంద్రంలోని కింగ్స్ కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ ఎన్నికల వ్యూహరచన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ.. 49 వార్డులలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. పట్టణ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేశారు. అభివృద్ధియే కాంగ్రెస్ నినాదమని, అదే మంత్రంతో ప్రజల ముందుకు వెళ్తామని తెలిపారు. గతంలో పట్టణాన్ని నిర్లక్ష్యం చేసిన నాయకులు ఎన్నికల సమయంలోనే ప్రజలను సంప్రదిస్తున్నారని విమర్శించారు.
అంతర్గత రహదారుల విస్తరణ, ఆధునిక డ్రైనేజీ, మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు, ఆసుపత్రుల ఆధునికీకరణ, ప్రభుత్వ పాఠశాలలను ‘అమ్మ మోడల్ స్కూల్స్’గా అభివృద్ధి చేయడం వంటి హామీలను ప్రస్తావించారు. అభ్యర్థులు ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు. స్థానిక సమస్యలను గుర్తించి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. క్రమశిక్షణ, ఐక్యతతో పనిచేసి 49 వార్డుల్లో విజయం సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు పాల్గొన్నారు.



