Thursday, February 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుదేశ సినీ పరిశ్రమకు హైదరాబాద్‌ను కేంద్రంగా మారుస్తాం: డిప్యూటీ సీఎం

దేశ సినీ పరిశ్రమకు హైదరాబాద్‌ను కేంద్రంగా మారుస్తాం: డిప్యూటీ సీఎం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమకు హైదరాబాద్‌ను ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బుధవారం నాడు సచివాలయంలో గద్దర్ సినిమా అవార్డుల జ్యూరీ సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి నగరాల్లో సినీ పరిశ్రమ విస్తరణకు అవకాశాలు పరిమితంగా ఉన్నాయని, కానీ అన్ని భాషల పరిశ్రమలు హైదరాబాద్‌లో అభివృద్ధి చెందడానికి అనేక సానుకూల అంశాలు ఉన్నాయని భట్టి విశ్లేషించారు. సకల భాషల చిత్ర పరిశ్రమలు హైదరాబాద్‌కు తరలివస్తే రాష్ట్ర యువతకు, టెక్నీషియన్లకు, రచయితలకు, దర్శకులకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ సినీ మార్కెట్‌కు హైదరాబాద్ కేంద్రంగా మారనుందని, ఇందుకు సంబంధించిన బ్లూప్రింట్‌ను ప్రభుత్వం సిద్ధం చేస్తోందని వెల్లడించారు.

గత ప్రభుత్వం దశాబ్దాలుగా సినిమా అవార్డులను నిర్లక్ష్యం చేసిందని, కానీ తమ ప్రభుత్వం సినీ రంగానికి తిరిగి పురస్కారాలు అందించి ప్రోత్సహిస్తోందని భట్టి వివరించారు. సమాజం కోసం, కళల ద్వారా తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానుభావుడు గద్దర్ అని ఆయన కొనియాడారు. తెలంగాణ కళలు, సంస్కృతి, విప్లవ స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన వ్యక్తి గద్దర్ అని, అందుకే ఆయన పేరు మీద గత ఏడాది నుంచి అవార్డులు అందిస్తున్నామని తెలిపారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే అవార్డుల ఎంపిక ఉంటుందని భట్టి హామీ ఇచ్చారు. గద్దర్ అవార్డుకు ఎంపికయ్యే సినిమాల్లో వాణిజ్య అంశాలతో పాటు బలమైన సామాజిక సందేశం ఉండేలా చూడాలని జ్యూరీ సభ్యులకు సూచించారు. ఈ నెల 6 నుంచి అవార్డుల స్క్రీనింగ్ ప్రారంభమవుతుందని, ఫిబ్రవరి 19న ఉగాది పర్వదినం నాడు అవార్డుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -