నవతెలంగాణ – హైదరాబాద్ : పంజాబ్లో పట్టపగలే గన్ కల్చర్ మరోసారి కలకలం రేపింది. జలంధర్లోని అత్యంత రద్దీగా ఉండే మోడల్ టౌన్ ప్రాంతంలో ఆప్ నేత లక్కీ ఒబెరాయ్ దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం ఉదయం స్థానిక గురుద్వారా సాహిబ్ వెలుపల ఈ ఘటన చోటుచేసుకుంది. తన కారులో కూర్చుని ఉన్న ఒబెరాయ్ను లక్ష్యంగా చేసుకుని దుండగులు ఒక్కసారిగా తూటాల వర్షం కురిపించారు. దాదాపు ఐదు బుల్లెట్లు ఆయన శరీరంలోకి దూసుకెళ్లడంతో తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు.
లక్కీ ఒబెరాయ్ ప్రతిరోజూ ఉదయం గురుద్వారాను సందర్శించడం ఆనవాయితీ. దుండగులు ఆయన దినచర్యను ముందే గమనించి, పక్కా ప్లాన్తో రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన కారు ఎక్కుతున్న సమయంలోనే ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఒబెరాయ్ భార్య గతంలో ‘ఆప్’ తరఫున మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు. రాజకీయ కారణాలా? లేక పాత కక్షలా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



