నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత జట్టులోకి తన ఎంపిక ఒక కలలా జరిగిపోయిందని టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అన్నాడు. స్పెయిన్లో జరిగే రియల్ మాడ్రిడ్ ఫుట్బాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లడానికి సిద్ధమవుతున్న తరుణంలో తనకు అనూహ్యంగా జట్టు నుంచి పిలుపు వచ్చిందని తెలిపాడు. గాయపడిన హర్షిత్ రాణా స్థానంలో సిరాజ్ను సెలక్టర్లు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఆసక్తికర విషయాన్ని సిరాజ్ మ్యాచ్ అనంతరం పంచుకున్నాడు. “రెండు రోజుల క్రితం సూర్య భాయ్ నాకు ఫోన్ చేసి, ‘మియా, బ్యాగులు సర్దుకుని వెంటనే ముంబైకి వచ్చేయ్’ అన్నాడు. నేను నమ్మకుండా, ‘భాయ్, జోక్ చేయకు.. ఇది జరిగే పని కాదు’ అని చెప్పాను. కానీ అతను ‘నేను నిజమే చెబుతున్నా, రెడీ అవ్వు’ అని బదులిచ్చాడు” అని సిరాజ్ వివరించాడు. సూర్య ఫోన్ చేసిన కొద్దిసేపటికే, సెలక్షన్ కమిటీ సభ్యుడు ప్రగ్యాన్ ఓఝా కూడా ఫోన్ చేసి ఇదే విషయం చెప్పడంతో తన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయని అన్నాడు. “ఫిబ్రవరి 15న రియల్ మాడ్రిడ్ గేమ్ చూసేందుకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాను. టికెట్లు కూడా బుక్ అయ్యాయి. కానీ, దేవుడు ఏది రాసిపెడితే అదే జరుగుతుంది” అని సిరాజ్ వ్యాఖ్యానించాడు.



