నవతెలంగాణ-హైదరాబాద్: భద్రతా కారణాల దృష్ట్యా భారత్ వేదికగా టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఆడటానికి నిరాకరించిన బంగ్లాదేశ్ను టోర్నీ నుంచి తప్పించి స్కాట్లాండ్కు అవకాశం ఇవ్వగా, బంగ్లాకు మద్దతుగా పాక్ ఈ బహిష్కరణ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై ఐసీసీ పాక్ క్రికెట్ బోర్డుకు డెడ్ లైన్ విధించింది. 24 గంటల్లో స్పష్టత ఇవ్వాలని చెప్పింది. ఐసీసీ ఆల్టీమేటంతో … పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ సోమవారం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో భేటీ కానున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారమే పాక్ ఈ మ్యాచ్ ఆడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న కొలంబో వేదికగా ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ జరగాల్సి ఉంది.
కాగా,ఆదివారం లాహోర్లో పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీతో ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతినిధులు సమావేశమయ్యారు. సుమారు ఐదు గంటల పాటు సాగిన ఈ చర్చల్లో పీసీబీ… మూడు కీలక డిమాండ్లను ఐసీసీ ఉంచినట్లు సమాచారం. బంగ్లాదేశ్లో క్రికెట్ అభివృద్ధి కోసం ఐసీసీ నుంచి అదనపు నిధులు కేటాయించాలని, టోర్నీలో పాల్గొనకపోయినా బంగ్లాదేశ్కు ‘పార్టిసిపేషన్ ఫీజు’ చెల్లించాలని, భవిష్యత్తులో ఐసీసీ మెగా ఈవెంట్ల ఆతిథ్య హక్కులను బంగ్లాదేశ్కు కల్పించాలని డిమాండ్లను ఐసీసీ ముందుంచింది.



