నవతెలంగాణ-హైదరాబాద్ : టీ20 ప్రపంచకప్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూలు ప్రకారమే కొనసాగనుంది. ఆ మ్యాచ్ను బహిష్కరించాలన్న తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం సోమవారం ( ఫిబ్రవరి 9న) ప్రకటించింది. చర్చల ద్వారా వచ్చిన ఫలితంతో సంతృప్తి చెందడంతో పాటు మిత్ర దేశాల విజ్ఞప్తితో భారత్తో మ్యాచ్ ఆడేందుకు తమ టీంకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు వెల్లడించింది. టీమిండియా- పాక్ మ్యాచ్ ఈ నెల 15వ తేదీన కొలంబోలో జరగనుంది.
అయితే, గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), ఐసీసీ మధ్య సుధీర్ఘ చర్చలు జరిగాయి. భారత్తో మ్యాచ్ బహిష్కరణ నిర్ణయంపై మరోసారి ఆలోచించాలని శ్రీలంక, ఎమిరేట్స్ బోర్డులు పీసీబీని కోరాయి. టీమిండియాతో మ్యాచ్ ఆడాలని పాక్ కు తాను విజ్ఞప్తి చేసినట్లు బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లామ్ పేర్కొన్నాడు. శ్రీలంక ప్రధాని అనురకుమార కూడా పాక్ ప్రధాని షరీఫ్తో ఫోన్లో మాట్లాడినట్లు దాయాది దేశం వెల్లడించింది. ఇక, పాక్, భారత్, బంగ్లాదేశ్లతో ముక్కోణపు సిరీస్ను నిర్వహించాలని పీసీబీ పెట్టిన డిమాండ్ను ఐసీసీ పూర్తిగా తిరస్కరించింది.
ఇక, ప్రపంచకప్కు దూరంగా ఉండటంతో బంగ్లాదేశ్ బోర్డుకు జరిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చేందుకు పీసీబీ ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తుంది. భారత్తో ద్వైపాక్షిక క్రికెట్ పునరుద్ధరణకు కూడా పీసీబీ డిమాండ్ చేయగా.. అది ఐసీసీ చేతుల్లో లేదని వెల్లడించింది. అయితే, వచ్చే అండర్-19 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను బంగ్లాకు కట్టబెట్టే ఛాన్స్ ని ఐసీసీ పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. భారత్లో టీ20 ప్రపంచకప్ ఆడేందుకు తిరస్కరించడంతో బంగ్లాదేశ్పై ఎలాంటి ఆంక్షలు విధించమని ఐసీసీ తేల్చి చెప్పింది.



