నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని 10 ప్రధాన కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో సుమారు 30 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని, దేశవ్యాప్తంగా 600కు పైగా జిల్లాల్లో దీని ప్రభావం ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ ఈ సమ్మె చేపడుతున్నట్లు సంఘాలు ప్రకటించాయి. ముఖ్యంగా, కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, ఉపాధి హామీ పథకంలో మార్పులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా సహా పలు రైతు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి.
గతేడాది జూలై 9న జరిగిన సమ్మెలో దాదాపు 25 కోట్ల మంది పాల్గొనగా, ఈసారి అంతకంటే ఎక్కువ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ మాట్లాడుతూ.. “ఫిబ్రవరి 12న జరిగే సమ్మెలో కనీసం 30 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారు. గతసారి జూలై 9న జరిగిన ఆందోళనలో సుమారు 25 కోట్ల మంది పాల్గొన్నారు,” అని తెలిపారు.
తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకపోతే, భవిష్యత్తులో మరిన్ని రోజులు కొనసాగేలా తీవ్రమైన ఆందోళనలు చేపడతామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఈ బంద్తో ఒడిశా, అసోం వంటి రాష్ట్రాలు పూర్తిగా స్తంభించిపోవచ్చని సంఘాల నేతలు పేర్కొన్నారు.



