నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం పథకం అమలు తీరుపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పథకం ద్వారా యువతకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వేగవంతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన మంజూరు పత్రాలను జూన్ 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం, జూన్ 15వ తేదీ తర్వాత ఎంపికైన యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా 5 లక్షల మంది యువతకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించినట్లు భట్టి విక్రమార్క వివరించారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ, తొలి విడతలో భాగంగా లక్ష రూపాయలలోపు విలువ గల చిన్న యూనిట్లకు ప్రాధాన్యతనిస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా యువత ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని ఆమె పేర్కొన్నారు.