నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో యూఎస్ డీల్ను వ్యతిరేకిస్తూ.. యూత్ కాంగ్రెస్ నాయకులు అర్ధ నగ్న ప్రదర్శన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై బీజేపీ నాయకుల విమర్శలకు ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. ‘‘నరేంద్ర మోదీ గారూ, అహింసతో కూడిన శాంతియుత నిరసనలు ప్రజాస్వామ్యానికి పునాదులు. మా కార్యకర్తలు చొక్కాలు విప్పి నిరసన తెలపడం సిగ్గుచేటని మీరు అంటున్నారు. కానీ, సెక్స్ అఫెండర్ జెఫ్రీ ఎప్ స్టీన్ ఫైల్స్ లో మీ పేరు, మీ స్నేహితుడి పేరు, మీ కేంద్ర మంత్రి పేరు బయటపడటం కంటే సిగ్గుచేటు మరొకటి ఉంటుందా? దీనికి మీరు ఏం సమాధానం చెబుతారు?’’ అని రాహుల్ నిలదీశారు.
అమెరికాతో ట్రేడ్ డీల్ ద్వారా మీరు దేశాన్ని అమ్మేశారని, ఆ రహస్య ఒప్పందమే దేశానికి అసలైన అవమానమని రాహుల్ ధ్వజమెత్తారు. గాంధీజీ, భగత్ సింగ్ చూపిన పోరాట మార్గాన్ని అనుసరిస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోందని ఆయన ప్రశ్నించారు. నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్ నేతల కుటుంబ సభ్యులను వేధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.



