నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలో నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) పార్టీకి చెందిన నలుగురు సీనియర్ నాయకులు జనజీవనంలోకి వచ్చారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో అధికారికంగా లొంగిపోయారు. వీరిలో పొలిట్ బ్యూరో సభ్యుడు (పీబీఎం) తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ అలియాస్ కుమ్మ దాదా, సెంట్రల్ కమిటీ సభ్యుడు (సీసీఎం) మల్లారాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ రంగారం, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ జగన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు (ఎస్సీఎం) నూనె నరసింహా రెడ్డి అలియాస్ గంగన్న అలియాస్ రన్నా దాదా ఉన్నారు. 40 ఏళ్లకు పైగా అజ్ఞాతంలో పనిచేసిన ఈ అగ్రనేతలు లొంగుబాటు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీని పూర్తిగా నిర్వీర్యం చేసినట్లు పోలీసులు ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వ పునరావాస పథకం ప్రకారం తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీపై రూ.25 లక్షలు, మల్లారాజి రెడ్డిపై రూ.25 లక్షలు, బడే చొక్కారావు, నూనె నరసింహా రెడ్డిలపై రూ.20 లక్షల చొప్పున నగదు రివార్డు మొత్తాన్ని వారికి అందజేస్తామని ప్రకటించారు. 2019లో తెలంగాణలో మావోయిస్టులు రిక్రూట్మెంట్ జరిగిందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.



