నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలో మరో విషాదం చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలో కిడ్నాప్కు గురైన భారత సంతతి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. 57 ఏళ్ల అవతార్ సింగ్ మృతదేహాన్ని బెర్రీస్సా సరస్సు సమీపంలో అధికారులు కనుగొన్నారు. గత వారం ట్రేసీ నగరంలోని ఓ గురుద్వారా వెలుపల ఆయన్ను అపహరించుకుపోయిన నాలుగు రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే… ఈ నెల 17న ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అవతార్ సింగ్ను బలవంతంగా ఓ తెల్లని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు.
ఆయన ప్రతిఘటించినా దుండగులు అపహరించుకుపోయారు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా కిడ్నాప్ దృశ్యాలు రికార్డయ్యాయి.”కిడ్నాప్ అయిన అవతార్ సింగ్ మరణించినట్లు ధ్రువీకరిస్తున్నాం. ఈ దారుణానికి పాల్పడిన వారిని గుర్తించేందుకు మా డిటెక్టివ్లు దర్యాప్తు చేస్తున్నారు” అని శాన్ జోక్విన్ షెరిఫ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఈ దాడి యాదృచ్ఛికంగా జరగలేదని, దుండగుల అసలు లక్ష్యం అవతార్ సింగ్ కాకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. “వారు ఒక ప్రత్యేకమైన కారణంతో వేరొక వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నారు. ఆ కారణం త్వరలోనే వెలుగులోకి వస్తుందని ఆశిస్తున్నాం” అని షెరిఫ్ పాట్రిక్ విత్రో స్థానిక మీడియాకు తెలిపారు.



