నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్ష ఫలితాలలో జిల్లా విద్యార్థులు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. ఇందుకు కష్టపడి చదివి మంచి ఉత్తీర్ణతను పొందాలన్నారు. బుధవారం ఆయన జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ హాస్టల్లలో ఉంటూ పదవ తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు ఉద్దేశించి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదీత్య భవన్లో ఏర్పాటుచేసిన ఓరియంటేషన్, కౌన్సిలింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు.
విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఎలా చదివామన్నది ముఖ్యం కాదని ,పరీక్ష ఎంత బాగా రాశామన్నది ముఖ్యమని అన్నారు. పరీక్షల సందర్భంగా విద్యార్థులు ఎలాంటి ఆందోళన పడవద్దని ,ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, ఏవైనా సందేహాలు తలెత్తితే టీచర్ల ద్వారా ముందే నివృత్తి చేసుకోవాలని, ప్రశ్నించినప్పుడే లాభం కలుగుతుందని ,ఈ సూత్రాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గత సంవత్సరం జిల్లాలో ఎస్ సి హాస్టల్లలో ఉంటూ పదవ తరగతి చదివిన విద్యార్థుల ఉత్తీర్ణత 93% శాతం ఉండగా.. ఈ సంవత్సరం నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు.
ప్రతి సబ్జెక్టు, ప్రతి లెసన్ బాగా చదవడమే కాకుండా, రివిజన్ చేయాలని ఇందుకు పరీక్షలు బాగా రాయాలని విద్యార్థులకు సూచించారు. పదవ తరగతి జీవితానికి టర్నింగ్ పాయింట్ అని, భవిష్యత్తు మొత్తం దీనిపైనే ఆధారపడి ఉంటుందని, భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివేందుకు, ఉద్యోగాలు సాధించేందుకు, అలాగే బ్యాంకు ద్వారా పొందే రుణాలు పొందేందుకు పదవ తరగతి మార్కులను ప్రమాణికంగా తీసుకోవడం జరుగుతుందని, అందువల్ల బాగా చదివి మంచి మార్కులు పొందాలన్నారు. కాగా సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటూ పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఈ సంవత్సరం జిల్లాలో 726 మంది హాజరవుతున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిడి శశికళ తెలిపారు. ఎస్ సి సంక్షేమ హాస్టళ్ల సంక్షేమ అధికారులు, ట్యూటర్స్ తదితరులు ఉన్నారు.



