నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడుకి చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నేత, స్వాతంత్య్ర సమరయోధుడు ఆర్. నల్లకణ్ణు (101) బుధవారం కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యం.. వయో సంబంధిత సమస్యలతో బాధపడుతూ చికిత్స కోసం ఫిబ్రవరి 1న చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికిలో చేరారు. ఆయన ఆరోగ్యం క్షీణించి ఈరోజు మధ్యాహ్నం 1.55 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. సిపిఐ పార్టీకి చెందిన ఆర్. నల్లకణ్ణు .. అందరికీ ఆర్ఎన్కెగా సుపరిచితులు. ఈయనకు ఆండాళ్, కాశీ భారతి అనే ఇద్దరు కుమార్తెలున్నారు.
గడచిన 24 గంటల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదు. ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్సనందించింది. అయితే ఆయన శరీరం చికిత్సకు స్పందించలేదు. ఐసియులో చికిత్స పొందుతున్నప్పటికీ.. అవయవాలన్నీ పూర్తిగా దెబ్బతిని ఆరోగ్యం పరిస్థితి మరింత క్షీణించి మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు అని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు.
కాగా, 1948లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం, సాయుధ పోరాటాల తర్వాత 1949-50లో అనేక మంది కమ్యూనిస్టు నేతలను అరెస్టు చేశారు. వీరిలో ఆర్ నల్లకణ్ణు కూడా ఉన్నారు. ఈయనకు అప్పుడు జీవిత కాలం జైలు శిక్ష విధించబడింది. ఈయనను పోలీసులు చిత్రహింసలు పాల్జేశారు. ఆయన పెదవిని సైతం ఓ పోలీసు అధికారి కాల్చారు. కానీ ఆ తర్వాత నిర్దోషులుగా విడుదలయ్యారు. 1952లో ఈ కేసు ముగిసింది. ఈ ఘటన తమిళనాడులో చారిత్రికంగా నిలిచిపోయింది.



