నవతెలంగాణ-హైదరాబాద్ : రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీ షాకిచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ముంబైలోని ఆయన విలాసవంతమైన నివాసం ‘అబోద్’ను జప్తు చేసినట్లుగా అధికారిక ప్రకటన వెలువడింది. ముంబైలోని పాలిహిల్ ప్రాంతంలో ఉన్న ఈ భవనం 66 మీటర్ల ఎత్తుతో 17 అంతస్తులను కలిగి ఉంది. జప్తు చేసిన ఈ ఆస్తి విలువ బహింగ మార్కెట్లో రూ.3,716.83 కోట్లు ఉంటుందని ఈడీ అధికారులు తెలిపారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈ తాత్కాలిక జప్తు ఉత్తర్వులను ఇవాళ అనిల్ అంబానీకి జారీ చేశారు. తాజా ఉత్తర్వులతో కలిపి ఈ కేసులో ఇప్పటివరకు జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.15,700 కోట్లకు చేరింది.
కాగా, అనిల్ గ్రూప్ కంపెనీలు రూ.కోట్ల బ్యాంకు రుణాల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దీనిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. రిలయన్స్ ఇన్ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు రూ.17 వేల కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది జులైలో రిలయన్స్ గ్రూప్లోని 50 కంపెనీలకు చెందిన 35 ప్రాంతాల్లో, 25 మంది వ్యక్తులపై ఈడీ సోదాలు నిర్వహించింది. దీనిపై ఈడీ లోతుగా దర్యాప్తు చేపడుతోంది.



