నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమల ఘాట్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఓ ద్విచక్రవాహనదారుడు ప్రాణాలు కోల్పోయాడు. మొదటి ఘాట్ రోడ్డులోని అత్యంత ప్రమాదకరమైన మలుపుల్లో ఒకటైన 30వ మలుపు వద్ద ఈ ఘటన జరిగింది.
తమిళనాడులోని అరక్కోణం తాలుకా మిట్టపిట్టై గ్రామానికి చెందిన నటరాజన్, మునిరత్నం శ్రీవారి దర్శనం కోసం బైక్పై తిరుమలకు వచ్చారు. దర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా మొదటి ఘాట్ రోడ్డులోని 30వ మలుపు వద్ద వారి వాహనం అదుపుతప్పింది. అతి వేగంగా వెళ్తున్న బైక్ నేరుగా రోడ్డు పక్కన ఉన్న పిట్టగోడను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావం జరగడంతో నటరాజన్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
యాక్సిడెంట్ను గమనించిన ఇతర భక్తులు వెంటనే టీటీడీ భద్రతా సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. తీవ్రంగా గాయపడిన మునిరత్నం అనే వ్యక్తిని అంబులెన్స్లో తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు.


